శ్రీవారి ‘నేత్ర దర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన విజయవాడ వాసులు

శ్రీవారి ‘నేత్ర దర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన విజయవాడ వాసులు

విజయవాడలో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడవ రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు.

విజయవాడ పి.డబ్ల్యు.డి.గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు అర్చన, ఉదయం 8.45 నుంచి 9.00 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.

నేత్రదర్శనం విశిష్టత :

ప్రతి గురువారం ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, మొదటి సహస్రనామార్చన, నైవేద్యం తరువాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు, నగలను అర్చకులు తొలగిస్తారు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గించడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయి. అందువల్లే దీనిని నేత్ర దర్శనం అంటారు.

శ్రీవారి ‘నేత్ర దర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన విజయవాడ వాసులు

తిరుప్పావడ సేవ – ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు 

ప్రతి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అర్చనానంతరం జరిగే నివేదననే తిరుప్పావడసేవని, అన్నకూటోత్సవమని అంటారు. ఈ ఘట్టాన్ని విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయంలో అర్చకులు భక్తుల ఎదుట ఆవిష్కరించారు.

శ్రీస్వామివారికి ఎదురుగా పెద్దపళ్లెంలో పులిహోర రాశిని ఏర్పాటుచేశారు. పులిహోరతోపాటు టెంకాయ, ఇతర పూజాసామగ్రితో అలంకరిస్తారు. వీటిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. ఆ తరువాత భక్తుల చేత సంకల్పం చెప్పించారు. వేదపండితులు వేద పారాయణంతోపాటు శ్రీనివాస గద్యాన్ని పఠించారు.

అంతకుముందు శ్రీవారి మూలవిరాట్‌ నొసటన వెడల్పుగా గల నామాన్ని తగ్గించి సన్నగా చేశారు. ఈ మొత్తం కైంకర్యమంతా తెరల వెనకనే చేస్తారు. ”శ్రీవారు నేత్రాలు తెరిచిన తర్వాత తొలి చూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయి. వీటిని మానవమాత్రులు ఏమాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగానే స్వామివారి తీక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చూస్తారు. దీనివల్ల ఆ ఆహారపదార్థాలు పవిత్రత పొందుతాయి.

దేశ ప్రజలందరూ పాడిపంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బందీ రాకూడదని, సర్వసౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు అభివృద్ధి పొందాలని, ఎటువంటి ఈతి బాధలు కలుగ కూడదని సంకల్పాన్ని చెప్పి తిరుప్పావడ సేవను ఆచరిస్తారు.

అనంతరం 10.00 నుంచి 10.30 గంటల వరకు రెండో నివేదన,ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల భక్తులకు సర్వదర్శనం కల్పించారు. సాయంత్రం 5.45 గంటల నుంచి రాత్రి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకరణసేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.15 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.15 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహించనున్నారు.

Source

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Bhakti Saram. All Rights Reserved bhaktisaram