రామతీర్థం శ్రీ రాముడు నడయాడిన పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. దృఢమైన రాతి కొండల నడుమన ఉన్న ఈ గ్రామం, ఇక్కడ కొలువై ఉన్న రామచంద్రస్వామి ఆలయం, కొండపై ఉన్న శాశ్వత నీటి బుగ్గలు, వివిధ ప్రదేశాలు ప్రతి ఒక్కటి రామ నామంతో ముడిపడి ఉన్నాయి.
రామతీర్థం చరిత్ర
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఉన్న రామతీర్ధం ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ 469-496 AD మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఇక్కడో చిన్న ఆలయం ఉండేదని చరిత్ర చెబుతుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ఆలయ జాడ కనుమరుగైపోయిందట. మళ్లీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి ఇక్కడి చెరువులో శ్రీరామునితో సహా ఇతర దేవతా మూర్తులు విగ్రహాలు దొరికాయి . ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించారు. చెరువులో దొరికిన విగ్రహాలు కావడం వల్లే రామతీర్థం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించడమే కాదు...ఆలయ నిర్వహణకోసం కొన్ని భూములు ఇనాంగా ఇచ్చారు పూసపాటి రాజు.అప్పటి నుంచి ఆయన ఇచ్చిన ఆ భూముల ఆదాయంతోనే ఇప్పటికీ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఏటా ఇక్కడ జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
రామతీర్థం ప్రకృతి రమణీయతకు ఆలవాలం
రామతీర్థంలో సీతారామస్వామి దేవాలయం నీలాచల కొండకు, భాస్కర పుష్కరిణికి మధ్య పచ్చటి వాతావరణం మధ్యలో నిర్మించారు. పురాతన విజయనగర వాస్తు కళకు ఈ ఆలయం ఒక ఉదాహరణ. ఇక్కడ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ జరిగే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు హాజరవుతారు.
రామతీర్ధం ఆలయం రెండుభాగాలుగా ఉంటుంది. మొదటిభాగం కొండకింద విజయనగర రాజులు నిర్మించిన రామతీర్ధం ఆలయం కాగా దాని ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై కోదండరామ స్వామి ఆలయం ఉంటుంది . ఈ కొండనే నీలాచలం అనీ బోధి కొండని కూడా పిలుస్తారు .
రామతీర్థం లో పాండవులు సంచరించిన గుర్తులు
- ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో రామతీర్థం ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో కృష్ణుని కూడా తమతో రమ్మని పాండవులు కోరితే.. సీతారామలక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజించమని చెప్పాడట. ఇక్కడి భీముని గృహం ఉండడం వారు సంచరించరనడానికి ఆనవాళ్లని చరిత్రకారులు చెబుతారు.
- రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటూ కార్తికమాసంలోనూ ఈ ఆలయం కన్నులపండువగా ఉంటుంది.
- ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవూ, 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.
- రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవంటారు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు కనిపిస్తాయి
- ఈ ప్రాంతంలో జైనులు, బౌద్ధులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
- ఈ క్షేత్రాన్ని ఆనుకుని చంపావతీ నదీ ప్రవహిస్తూ ఉంటుంది.
- విగ్రహాలు దొరికాయని చెప్పే 13 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పడ్డ పుష్కరిణి ఎంతో ప్రత్యేకం .
- ప్రధాన ఆలయంలో శ్రీరామ స్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది .
- పర్వదినాల్లో గ్రామమంతా ఊరేగించే ఉత్సవ మూర్తులు ,వివిధ వాహనాలు ,తులాభారాలు నిర్వహించే త్రాసు లాంటివి ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాయి.
ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు మాత్రమే కాదు శివరాత్రి కూడా కన్నులపండువగా జరుగుతుంది. ఇప్పటికీ ఈ ఆలయానికి పూసపాటి వంశీయులే ధర్మకర్తలుగా ఉన్నారు .
ఈ ఆలయంలో వెండి కవచాలలో రామచంద్ర స్వామి, సీత మరియు లక్ష్మణుల అందమైన విగ్రహాలు చూడవచ్చు. ఆలయ పరిసరాల్లో అందమైన సరస్సు ఉంది. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలోఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. శ్రీరామనవమి మరియు వైకుంఠ ఏకాదశి పండుగలు ఇక్కడ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థం గిరిప్రదక్షిణ నిర్వహిస్తారు. విష్ణు నామాలతో అనేక తాబేళ్లు ఆలయంలో తిరుగుతూ ఉంటాయి. పెద్ద జీయర్ ప్రతిష్టించిన రామ స్తంభం కూడా ఉంది.
రామతీర్థంలో శివాలయం
రామతీర్థంలో రామాలయం పక్కనే, 2007లో నిర్మించిన శివాలయం కూడా ఉంది. శివాలయంలోని శ్రీకామాక్షి దేవిని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాలి. ప్రతి పౌర్ణమికి మరియు నవరాత్రి ఉత్సవాల సమయంలో శివాలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యమైన రోజులలో చాలా మంది భక్తులు రెండు దేవాలయాలను సందర్శిస్తారు. ఈ ప్రదేశం చాలా మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు చారిత్రాత్మకమైనది కూడా. ఇది విజయనగరం టౌన్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 15 కి.మీ దూరంలో ఉంది. ఆలయం ఉదయం 6 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది.