కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు 10 వ తేదీ శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని  ఫిబ్ర‌వ‌రి 11 నుండి ఆల‌యంలో అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.  మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతాయి. కోవిడ్ అనంతరం మొదటిసారిగా పురవీధుల్లో వాహనసేవలు నిర్వహిస్తున్నారు.

అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది.

ధ్వజారోహణం...

తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి ధ్వజారోహణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.54 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీమణిస్వామి, కంకణభట్టర్‌ శ్రీ ఉదయస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

ఏడాదికోసారి ధ్వజస్తంభానికి  విశేష అభిషేకం 

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.
అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

హంస వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజు శనివారం రాత్రి హంస వాహ‌నంపై శ్రీ సోమస్కంధమూర్తి తిరుచిపై శ్రీ కామాక్షి అమ్మ‌వారు పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంట‌లకు ఈ కార్య‌క్ర‌మం ప్రారంభమైంది .భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి

సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి క‌టాక్షం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై క‌టాక్షించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.

చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నారు.

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

చంద్రప్రభ వాహనంపై శ్రీ సోమ‌స్కంధ‌మూర్తి అభ‌యం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన ఆదివారం రాత్రి శ్రీ సోమ‌స్కంధ‌మూర్తి చంద్రప్రభ వాహనంపై అభ‌యమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.

శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.