మే 16న శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగం

తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 16వ తేదీన సోమ‌వారం ప‌త్ర‌పుష్పయాగం జ‌రుగ‌నుంది. ఇందుకోసం మే 15వ తేదీన సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా మే 16న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు సోమ‌స్కంద‌మూర్తికి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలు, ప‌త్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది. గృహ‌స్తులు(ఇద్ద‌రు) రూ.200/- చెల్లించి ప‌త్రపుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.

ఈ  ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులు, భ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.