తిరుపతిలోని అలిపిరి వద్దగల శ్రీవారి పాదాల మండపంలోని ఆలయాల బాలాలయం పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయం 10.27 నుండి 10.59 గంటల నడుమ మేష లగ్నంలో బాలాలయ చిత్రపటాలకు కుంభ ఆవాహన నిర్వహిస్తారు.
పాదాల మండపంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ పెరియాళ్వార్ ఆలయం, శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయాలు ఉన్నాయి. 8 హోమగుండాల్లో 14 మంది ఋత్వికులు బాలాలయం వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బాలాలయ కార్యక్రమాల వివరాలు
- బాలాలయంలో భాగంగా సోమవారం ఉదయం యాగశాలలో అకల్మష హోమం, లఘుపూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం పుణ్యాహవచనంలో అగ్నిప్రతిష్ట, కళాకర్షణ, కుంభారాధన ఉక్త హోమాలు నిర్వహించారు.
- ఫిబ్రవరి 25న ఉదయం అగ్నిప్రణయణం, చిత్రపటాలకు కుంభారాధన, అకల్మషహోమం, లఘుపూర్ణాహుతి, సాయంత్రం మహాశాంతి పూర్ణాహుతి, బాలాలయ చిత్రపటాలకు మహాశాంతిప్రోక్షణ నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 26న ఉదయం 7.30 గంటలకు పుణ్యాహవచనం, ఉదయం 10.27 నుండి 10.59 గంటల నడుమ ఫాల్గుణ శుద్ధ తదియ మేష లగ్నంలో బాలాలయ చిత్రపటాలకు కుంభ ఆవాహన చేపడతారు. మధ్యాహ్నం 11.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.