ధనుర్మాసం: తిరుప్పావై పఠనం ఇహ పర సుఖాలను ప్రసాదిస్తుంది

వేదాలు, ఉపనిషత్తులు ఏవైతే సరైనవి, తగినవి అని చెప్పాయో వాటన్నింటినీ తిరుప్పావైలో చూపించింది మన తల్లి గోదా. మార్గశీర్ష మాసంలో ఆచరించే ధనుర్మాస వ్రతంలో గోదాదేవి పాడిన 30 తిరుప్పావై పాశురాలను పాడుకుంటూ శ్రీరంగనాథుని ఆరాధించడం అనాదిగా వస్తున్న శ్రీవైష్ణవ సంప్రదాయం. సకల భోగభాగ్యాలను ప్రసాదించే తిరుప్పావై వ్రతం ఈ నెల 16 నుంచి ఆరంభమై జనవరి 14కు ముగుస్తుంది.

తిరుప్పావై అంటే శ్రీ వ్రతము. శ్రీ అంటే సంపద. అన్ని సంపదలను ఇచ్చే ఈ నోమునే ధనుర్మాస వ్రతం అంటారు. డిసెంబర్ మధ్యలో ధనూరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి జనవరి 14న మకరంలోకి వచ్చేవరకు ధనుర్మాసం అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న మాసాన్ని మార్గశీర్షం అంటారు. ఈ రెండూ ఒకటే. చాంద్రమానమును బట్టి మార్గశీర్షం అయితే, సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. మార్గము అనగా దారి లేదా ఉపాయం. శీర్షం అంటే శిరసువలె ప్రధానమైంది.

అందుకే భగవానుని పొందడానికి శ్రేష్ఠమైన ఉపాయమే ఈ వ్రతం అని ఉపనిషత్ సిద్ధాంతం. భగవానుడే ఉపాయం. ఇతరములేవీ కావు అనే విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది ఈ వ్రతం. ఉపనిషత్తు భాషలో ధనుస్సు అనగా ప్రణవం. అంటే ఓంకారం. ఇదే భగవంతుని తెలియజేసే శబ్దం. ఆ ప్రణవాన్ని ఉపాసించడం ద్వారా పరమాత్మను చేరు మార్గము ధనుర్మాస వ్రతం.

https://www.youtube.com/watch?v=K6y_HD2tlkg

గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ.

ఈ వ్రతానికి పాటించవలసిన నియమాలు



  • ఇష్టఫలమును అందుకొనుటకు కష్టపడవలె చెల్లెలా

  • నోము నోచే ధనుర్మాసం నీమనిష్టలె పూజలౌ

  • స్నానమంటే యమునలో

  • చలిమునకలేస్తే చాలదే

  • మనసు లోపలి మలినమంతా

  • కడిగి ముగ్గెయ్యాలిలే

  • పూసిన పూలూ పితికిన పాలూ పూతనాంతకుడి పూజకే

  • కంటికి కాటుక పెట్టకే

  • సిగలో పూలూ ముడవకే

  • వెన్నా మీగడ - జున్నూనేయీ

  • అన్నీ మన కన్నయ్యకే

  • కూడని మాటలు ఆడకే

  • పెద్దల మాటలు దాటకే

  • సిరినోము - హరిపూజ - గిరిపుత్రివరము

  • గోకులం కన్నెలకు కల్యాణకరము

  • లోకులం దరికిదే సౌభాగ్యప్రదము

  • పల్లెపిల్లా మేలుకో

  • రే- పల్లె పిల్లా మేలుకో


ద్వాపరం నుంచి ఇప్పటి దాకా..


ఈ వ్రతాన్ని ద్వాపర యుగంలో వ్రేపల్లెలోని గోపికలు కృష్ణుని పొందాలని ఇదే వ్రతాన్ని కాత్యాయనీ వ్రతంగా చేశారు. ఫలితంగా ప్రజలకు ఈతి బాధలు తొలగి, సర్వ సౌఖ్యాలను పొందారు. ఆ తరువాత కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి అక్కడ కొలువై ఉన్న వటపత్రశాయినే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానునిగా, ఆలయాన్ని నందగోప భవంగా, తన తోటి చెలికత్తెలందరూ గోపికలుగా, తానూ ఓ గోపికగా త్రికరణ శుద్ధిగా భావించి, ఈ వ్రతాన్ని ఆచరించింది. సర్వ విధాలుగా నీకే చెంది ఉన్నాను. నీదే అయిన ఈ ఆత్మకు అనర్థం జరుగకుండా కాపాడు. ఈ ఆత్మ స్వరూపానికి తగినట్లుగా నీ అంతరంగ కైంకర్యం పొందే భాగ్యాన్ని ప్రసాదించు అని ఆమె శ్రీకృష్ణుని వేడుకొన్నది. ఫలితంగా శ్రీరంగనాథుడిని చేరుకున్నది. గోదాదేవి ప్రార్థనే తిరుప్పావై సారము. ఈ ధనుర్మాస మహావ్రతం ఇహ పర ఐశ్వర్యాలను, భగవదనుభవాన్ని, కైంకర్యాన్ని ప్రసాదిస్తుంది.