పుష్పయాగంతో ఘనంగా ముగిసిన కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించిన పుష్పయాగానికి దాతల నుంచి 4 టన్నుల పుష్పాలు సమకూరాయి. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజున అమ్మవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.

ఆస్థాన మండపంలో ఉంచిన ఈ పుష్పాలను ప్రత్యేక పూజలకు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు, భక్తులు పూలతో నిండిన గంపలను తిరువీధుల్లో ప్రదక్షణగా తీసుకొచ్చి ఆలయానికి చేర్చారు.

అంగరంగవైభవంగా పుష్పయాగం


అమ్మవారి పుష్పయాగానికి బెంగళూరు, తమిళనాడు, విశాఖలోని పలువురు దాతలు నాలుగు టన్నులకు పై బడి వివిధ రకాల పుష్పాలను సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దాతలు సమర్పించిన పుష్పాల్లో మల్లి, కనకాంబరాలతో పాటు గన్నేరు పువ్వులో 3 రకాలు, కలువ, తామర, మొగలిరేకులు, పన్నీరు ఆకు, బిల్వం, మరువం, నూరు వరహాలు వంటి వివిధ రకాలున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా.. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగింది. ముఖ మండపంలో స్నపన తిరుమంజనం ముగిసిన తర్వాత ఆస్థాన మండపంలో ఆసీనురాలైన అమ్మవారికి 18 రకాల పుష్పాలతో పండితులు శాస్త్రోక్తంగా పుష్పయాగం జరిపించారు. ఈ పుష్ప యాగంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.