కల్పవృక్ష వాహనంపై రాజగోపాలునిగా భక్తులను కటాక్షించిన సిరులతల్లి

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు అమ్మవారు రాజగోపాలుడు అలంకరణలో కల్పవృక్ష వాహనంపై విహరించారు. ఉదయం 4 గంటలకు అమ్మ వారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వాహనమండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు.

అనంతరం పట్టు పీతాంబరాలు, రత్నకచిత మణిమాణిక్యాలతో రాజగోపాలునిగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువు దీర్చారు. ఉదయం 8 గంటలకు చిన్నారుల కోలాటాలు, సంప్రదాయ నృత్యకళాకారుల ప్రదర్శనలు, జియ్యర్ల ప్రవచనాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారు రాజగోపాలుడు అలంకరణలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

కల్పవృక్షం లక్ష్మీదేవి సహా పాలసముద్రం నుండి పుట్టిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ కల్పవృక్షం అత్యంత పుణ్యఫలాలను ఇస్తుందని, అమ్మవారిని ఈనాడు దర్శనం చేసుకుంటే గతజన్మ, ఈ జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయని పురాణవచనం.