హయగ్రీవుడు ఎందుకు అవతరించాడు?
హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అంటారు. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారు. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి, వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుని జ్ఞాన ప్రదాతగా కూడా భావిస్తారు. ‘హయగ్రీవుడు’ అంటే గుర్రపు తల కలిగినవాడు అని అర్థం.
హయగ్రీవుని ఈ ఆకారానికి కూడా ఓ కథ ఉంది. పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరాన్ని తన తపస్సంపత్తితో సంపాదించాడు. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనిని బట్టి హయగ్రీవుడు శత్రునాశకుడు అని కూడా మనకు అర్ధం అవుతుంది. హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయని పెద్దలు చెబుతారు.
హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా!
హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అయితే ఇది అత్యంత నిష్టతో చేయాలని పెద్దలు చెబుతారు. అందరూ ఉపాసించలేరు... కాబట్టి హయగ్రీవ జయంతి రోజున హయగ్రీవుని ఆరాధించినా పున్య ఫలమే లభిస్తుంది. హయగ్రీవుని లేదా శ్రీమహావిష్ణువు పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించి ధూప,దీప నైవేద్యాదులు సమర్పించి పూజించాలి.
హయగ్రీవుడు జ్ఞానప్రదాత
హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
ఇంతకుముందు చెప్పుకొన్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. కావడంతో చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. జయంతి నాడు హయగ్రీవుని ఆరాధించడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది.