చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూత

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ సాయంత్రం 5.00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయనున్నారు.

చంద్రగ్రహణం జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11.54 గంటలకు ప్రారంభమై జూలై 28న శనివారం ఉదయం 3.49 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 28న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.

జూలై 27న ఆర్జితసేవలు రద్దు


చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

జూలై 27న పౌర్ణమి గరుడసేవ రద్దు


చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27వ తేది శుక్రవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

జూలై 27న తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూత


చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.00 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ వుండదు. తిరిగి మరల జూలై 28వ తేదీ శనివారం ఉదయం 9.00 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పునః ప్రారంభమవుతుంది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పిఏసి-2, విక్యూసి-2, టిటిడి ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, ఎస్వీ విశ్రాంతి భవనాలలో అన్నప్రసాదాల వితరణ ఉండదు.

భక్తుల సౌకర్యార్థం ముదస్తుగా టిటిడి అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 20 వేల పులిహోర, టమోట అన్నం ప్యాకెట్లను సాయంత్రం 3.00 నుండి 5.00 గంటల వరకు పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1 మరియు 2, నాదనీరాజనం వేదిక ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు.

Source