తిరుమలలో వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం మంగళవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునర్‌ దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

harati

ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం నూతన స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

swarna kavacha samarpanam

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.

Source