తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 21 నుండి 29వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఆ తరువాత కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీఆండాల్ అమ్మవారు, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ పుండరికవల్లీ ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
Source