నేడు శ్రీవారి సేవ ‘రథసప్తమి’ స్లాట్‌ విడుదల

జనవరి 24న రథసప్తమి పర్వదినం నాడు తిరుమలకు విశేషంగా విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవ ”ప్రత్యేక సందర్భాల” స్లాట్‌ను జనవరి 9వ తేదీన టిటిడి విడుదల చేయనుంది. ఈ స్లాట్‌కు సేవకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొదటి బ్యాచ్‌లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 300 మంది ఈ స్లాట్‌ను బుక్‌ చేసుకుని భక్తులకు మెరుగైన సేవలందించారు. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ఈ సేవకు విచ్చేశారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, శ్రీవారి బ్రహ్మోత్సవాలు లాంటి రద్దీ సమయాల్లో ”ప్రత్యేక సందర్భాల” స్లాట్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని భక్తులకు సేవలందించవచ్చు.

ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో రథసప్తమి పర్వదినానికి గాను జనవరి 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ను అందుబాటులో ఉంచుతారు. 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు గల 300 మందికి ఈ స్లాట్‌ను బుక్‌ చేసుకునే అవకాశముంది. ఆసక్తి గలవారు తమ ఆధార్‌ కార్డు ద్వారా విడివిడిగా నమోదు చేసుకోవచ్చు. ఈ స్లాట్‌ పొందిన భక్తులు జనవరి 22వ తేదీన తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌లో రిపోర్టు చేయాలి. జనవరి 23, 24వ తేదీల్లో భక్తులకు సేవలందించాల్సి ఉంటుంది.

టిటిడి వెబ్‌సైట్‌ ”www.tirumala.org”లో ‘శ్రీవారిసేవ సర్వీసెస్‌’ అనే లింక్‌ను క్లిక్‌ చేసి ‘శ్రీవారి సేవ’ – ‘స్పెషల్‌ సేవ’ అనే ఆప్షన్ల ద్వారా ఈ స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ప్రయివేటు బ్యాంకు ఉద్యోగులకు పరకామణి సేవలో అవకాశం


టిటిడిలో హుండీ కానుకలు లెక్కించే పరకామణి సేవలో ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులకు అవకాశం కల్పించడమైనది. ప్రయివేటు బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది విజ్ఞప్తి మేరకు టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 9వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి భక్తులు ఆన్‌లైన్‌లో పరకామణి సేవను బుక్‌ చేసుకోవచ్చు.

పరకామణి సేవ చేసేందుకు 35 నుంచి 65 ఏళ్లలోపుగల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు, దక్షిణాదికి చెందిన జాతీయ బ్యాంకుల ఉద్యోగులు అర్హులు. తాజాగా 35 నుంచి 60 ఏళ్ల లోపు గల ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులకు అవకాశం కల్పించారు. ఇందుకోసం తొలిదశలో 30 మందికి అవకాశం కల్పించమైనది.

ఇందులో 3 రోజులు, 4 రోజుల స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 3 రోజుల స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు గురువారం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌లో రిపోర్టు చేయాలి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సేవ చేయాలి. 4 రోజుల స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు ఆదివారం రిపోర్టు చేయాలి. సోమవారం నుంచి గురువారం వరకు సేవలందించాలి. మొదట శ్రీవారి సేవాసదన్‌లో వీడియో ద్వారా పరకామణి సేవపై అవగాహన కల్పిస్తారు. ఈ అవకాశాన్ని అర్హులైనవారు వినియోగించుకోవాలని టిటిడి కోరుతోంది. 2012లో పరకామణి సేవను టిటిడి ప్రారంభించింది. ఇప్పటివరకు 74,261 మంది పరకామణి సేవకులు సేవలందించారు. టిటిడి ప్రయోగాత్మకంగా ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులకు పరకామణి సేవ చేసే అవకాశం కల్పిస్తోంది. దీనికి వచ్చే స్పందనను బేరీజు వేసుకుని టిటిడి తగిన నిర్ణయం తీసుకుంటుంది.

టిటిడి వెబ్‌సైట్‌ ”www.tirumala.org”లో ‘శ్రీవారిసేవ సర్వీసెస్‌’ అనే లింక్‌లో ‘పరకామణిసేవ’ను క్లిక్‌ చేసి బుక్‌ చేసుకోవచ్చు.

Source