మనం నిత్యం ఆచరించే వ్రతాలు చాలా ఉన్నాయి. మహిలలు తమ సౌభాగ్యంకోసం, సంతానం కోసం, తమ పిల్లల ఆయురారోగ్యాలకోసం పలు వ్రతాలను ఏడాది పొడవునా చేసుకుంటూనే ఉంటారు, అలాంటి వ్రతాల్లో అమా సోమవార వ్రతం వ్రతం ఒకటి. ఈ వ్రతం ఆచరించే రోజును సోమవతి అమావాస్యగా పిలుస్తారు. మహిళలు తమకు నిత్య సుమంగళి యోగం దక్కాలని ఈ వ్రతం ఆచిస్తారు. ఈ వ్రతాన్ని అమావాస్య సోమవారం కలిసి వచ్చే రోజన ఆచరించాలి. ఈ రోజు రావి చెట్టును పూజించి దాని చుట్టూ 108 ప్రదక్షణలు చేస్తే వైధవ్యం ప్రాప్తిచదని పురాణాలు చెబుతున్నాయి.
వ్రతం వెనుక కథ
అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆ కూతురికి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని,ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న ‘పోలి’ చాకలి వద్దకు తీసుకువెడితే గండం గట్టెక్కుతుందని ఒక పుణ్యపురుషుడు సెలవివ్వడంతో ఆ బాలిక పెద్దన్న చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు.
అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలబడి,"సముద్రాలను దాటడమెలాగా?" అని దిగాలుపడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మద్యన పడింది. అన్నా చెల్లెళ్ళిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి. అనంతరం అదే చెట్టుమీదనుండి ఒక గండభేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్నుమీద కూర్చోబెట్టుకుని సప్తసముద్రాల అవతల ఉన్న చాకలి పోలి వాకిట్లో దింపి అదృశ్యమైపోయింది.
అది మొదలు అన్నాచెల్లెళ్లు చాకలి పోలి వాకిలి తుడిచి ,కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ, దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు. తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ,రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతూ ఉండటం చూసిన చాకలి పోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసి, ఒకనాడు అన్నాచెల్లెళ్ళను కనిపెట్టింది,"ఎవరు మీరు? నా వాకిలినెందుకు ఊడుస్తున్నారు ? మీకేం కావాలి ?" అని అడిగింది. అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో పెద్దలు చెప్పిన మాట వినిపించి, ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు.
చాకలిపోలి సమ్మతించి,తన ఏడుగురు కోడళ్లని పిలిచి, తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి, ఆ అన్నాచెల్లెళ్లతో బయల్దేరింది. ఆమె దివ్యశక్తితో సప్తసముద్రాల్ని దాటి, వాళ్ల ఇంటికి చేరి పిల్లకి పెళ్ళి చేయమంది పోలి. పెళ్ళి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు. వెంటనే చాకలి పోలి తన ‘సోమవతి అమావాస్య’ వ్రత ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతనిని మళ్ళి బ్రతికించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆమెను స్తుతించడం ప్రారంభించారు.
అయితే తన నోము ఫలాన్ని ధారపోయడం ఫలితంగా, ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు. ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయల్దేరింది. దార్లో కనిపించిన రావి చెట్టును చూసి,108 గువ్వరాళ్లని ఏరి పట్టుకుని ఆ చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది. ఇక్కడిలా చెయ్యగానే, అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నారు. పోలి ఇంటికి చేరాక, ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి, జరిగిన అద్బుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా, చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది.
వ్రతం చేసుకునే విధానం
ఒకానొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుకు నమస్కరించి దిగువ ఈ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.
శ్లోకం: మూలతో బ్రహ్మరూపాయ | మద్యతో విష్ణురూపిణే |
అగ్రతశ్శివరూపాయ | వృక్షరాజాయతే నమ: |
అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ, నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి. చివర్లో ఒక పండో ఫలమో, మణో, మాణిక్యమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి. అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.
అలా 108 వ అమావాస్యా సోమవారం నాడు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత, వృక్షమూలంలో బియ్యంతో మండపం ఏర్పరిచి, బంగారంతో (యధాశక్తి) నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి,108 కలశాలను స్థాపించి ఆరాధించాలి. ఆఖరున మండపాన్ని, కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి. ముత్తయిదువలకు 108 ఫలాలను గాని, రత్నాలను గాని వాయనదానమివ్వాలి. శుభం భూయాత్....