
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం సాయంత్రం ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.