అక్టోబరు 20న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 20న దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు.

దీపావళి సందర్భంగా అక్టోబ‌రు 20వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించ‌నున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

అక్టోబర్ 17వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో అక్టోబర్ 20వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా అక్టోబర్ 17న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.