శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు 26వ తేదీ బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఆరోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌ జీయర్ స్వామి పాల్గొన్నారు.

చిన్నశేషవాహనం

గురువారం ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం కోదండరామస్వామి చిన్నశేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.