ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 6 నుండి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ మరియు కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయంలో మార్చి 5వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, అంకురార్పణం జరుగనుంది.
- మార్చి 6వ తేదీ ఉదయం 7.30 గంటలకు భగవత్పుణ్యాహము, అగ్ని మధనము, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా కుంభ, ఉపకుంభ, చక్రబ్జా మండల, పరివారకుంభారాధనలు, ప్రధాన మూర్తి హోమములు, శ్రీ మద్రామాయణ హవన ప్రారంభం, మన్మోహన శాంతి హోమం, పూర్ణాహుతి అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు చతుస్థానార్చనము, సహస్ర కలశాదివాసం, వేదాది పారాయణం, మూర్తి హోమం, పరివార హోమములు, పూర్ణాహుతి శాత్తుమొర జరగనుంది.
- మార్చి 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు సహస్ర కలశావాహన, రామ తారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన పంచసూక్త హోమములు, విమాన గోపురం ఛాయా స్నపనము, పరివార హోమములు, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతుఃస్థానార్చనము, మూర్తి హోమం జరుగనుంది.
- మార్చి 8న శనివారం ఉదయం 6 గంటలకు చతు:స్థానార్చనము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, సహస్రకలశాది దేవత హోమం, సహస్ర కలశాభిషేకం, పూర్ణాహుతి జరుగునుంది. సాయంత్రం 6 గంటలకు కళాపకర్షణ, శయ్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, తత్వన్యాస హోమములు, వేదాది పారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం నిర్వహించనున్నారు.
- మార్చి 9 ఆదివారం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీమద్రామాయణ హోమం, పంచసూక్త – పవమాన హోమములు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10 15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ మరియు మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గత ఏడాది సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు బాలాలయం నిర్వహించిన విషయం విధితమే. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు.