తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు బుధవారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వహించిన ఊంజల్సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది.
టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.
టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఇతర అధికారులు, 3,500 మందికి పైగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెందిన భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.