భగవంతుడు అందరివాడని భగవద్ రామానుజాచార్యులు ఉద్బోధించారని, ప్రస్తుత సమాజంలో అందరూ దీన్ని పాటించాలని టిటిడి తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి.
ఆదిశేషుని అవతారమైన భగవద్ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని, శరణాగతి భక్తితో భగవంతుని కొలిస్తే దివ్యత్వం కలుగుతుందని చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణంలో తెలియచేసారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. శ్రీ రామానుజార్యుల అవతార మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ “శ్రీ రామానుజ వైభవం”పై ఉపన్యసించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రేవతి బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.