అయోధ్యలో రేపటి నుంచి దర్శనాలకు అనుమతి

అయోధ్యలో జగదభిరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యింది. దీంతో మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయంలో ఆ దర్శనానికి ఎలా వెళ్లాలనేది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్‌ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు తొలుత ఆలయం చుట్టూ ఉండే బాహ్య ప్రాకారం దాటి లోపలికి రావాల్సి ఉంటుంది. అందులో మొత్తం ఐదు  నిర్మాణాలతోపాటు పవిత్ర గర్భాలయం ఉంటుంది. 795 మీటర్ల పరిధిలో ఉండే పర్కోటాలో 5 ఆలయాలుంటాయి. వాటిలో గర్భగుడి ఉంటుంది. గర్భ గుడికి ముందు 5 మండపాలుంటాయి.

దర్శన వివరాలు

  • దర్శన వేళలు, హారతి, అర్చనలకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. మందిరంలో రోజూ మూడు రకాల హారతులు నిర్వహిస్తారు. 
  • ప్రతిరోజూ ఉదయం 6.30, మధ్యాహ్నం 12.00, రాత్రి 7.30 గంటలకు మూడు హారతులు ఉంటాయి. అయితే.. ఈ వేడుకలకు పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. వీటిని ఉచితంగా జారీచేస్తారు. 
  • ఆలయంలో దర్శనం కోసం రెండు స్లాట్‌లు నిర్ణయించారు. మొదటి స్లాట్ ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు.. రెండో స్లాట్ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు ఉంటుంది.
  • దర్శనం కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో ఆలయ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్‌లో లాగిన్ అయి తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మై ప్రొఫైల్‌లో దర్శన స్లాట్‌లు లేదా హారతికి టికెట్‌లను బుక్ చేసుకోవాలి. ఆలయం లోపలికి వెళ్లే ముందు మందిర ప్రాంగణంలో ఉన్న కౌంటర్ వద్ద పాస్‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

సూర్యకిరణాలు నేరుగా స్వామిపై పడతాయి

ఆలయంలోని విగ్రహాలను నేపాల్ నుంచి సేకరించిన శాలిగ్రామ శిలతో తయారుచేశారు. ఈ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల నాటివని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కాళీ నది నుంచి శాలిగ్రామ శిలలను సేకరించేందుకు తొలుత కాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శిలాభిషేకం చేశారు. ఆ తర్వాతే దేవుళ్లకు క్షమాపణ చెబుతూ ఈ పవిత్ర శాలిగ్రామ శిలలను అయోధ్యకు తరలించారు. నవమి రోజున సూర్య కిరణాలు నేరుగా స్వామి వారి నుదుటిపై పడేలా విగ్రహం ఎత్తును ఏర్పాటు చేశారు.