తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకంలో భాగంగా రెండో రోజు గురువారం కవచప్రతిష్ఠ జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ఠ చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ తదితరులు పాల్గొన్నారు.