తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే వార్షిక వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.
ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం సాయంత్రం పుణ్యహవచనం, రక్షాబంధనంతోపాటు అంకురార్పణ నిర్వహించారు. ఆ తరువాత శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు చేపట్టారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా మే 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
ఆర్జితసేవలు రద్దు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు.

మొదటిరోజు వసంతోత్సవాలు
వసంతోత్సవాల్లో భాగంగా 7వతేదీ బుధవారం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.
రెండవరోజు వసంతోత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.