‘‘కాలభైరవా నమోస్తుతే - కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే"
ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది.
కాలభైరవ ఆవిర్భావం
ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు ‘నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి’ అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.
దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు.
హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.
‘నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి..’ అని శివుడు సలహా ఇచ్చాడు.
కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు
కాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు.
అందుకు ‘‘కాలభైరవా! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది ’అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు.
దీనితో కాలభైరవుడు కాశీచేరుకున్నాడు. ఆయనబ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని ‘కపాల మోక్ష తీర్థం’
తర్వాత కాలభైరవుని చూసి శివుడు ‘కాలభైరవా! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.’ శివుడు పలికాడు. దీనితో కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు.
కాలభైరవ ఆరాధన
కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీనుంచి వచ్చిన వారు కాశీసమారాధన చేయడం ఆచారం అయింది.
కాశీక్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక శునకమును కాలభైరవస్వామిగా భావించి పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు.
ఈ ఏడాది డిసెంబరు 15వ తేదీన కాలభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీకాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు. భైరవుని రూపాలు :...
భైరవుని రూపాలు :...
కాల భైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ
ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం.... ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
https://www.youtube.com/watch?v=YjVf3XBCYAw
కాలభైరవాష్టకం పఠించడం పుణ్యప్రదం
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ 'కాలభైరవాష్టకం' కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీకాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి.