గజవాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సోమ‌వారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వేంకటాద్రీశుడు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు.

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తి ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజూగాక, ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలలో వాహనసేవ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి.

కాగా బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ఊరేగనున్నారు.

Source