హిందువులు తమ జీవిత పరమార్థంగా భావించేది చార్ధామ్ యాత్ర. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాధ్లను ఉత్తరాఖండ్ చార్ ధామ్లుగా వ్యవహరిస్తారు. ఇక్కడి ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే భక్తుల సందర్శనార్ధం చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.
కేదార్ నాథ్
చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం పవిత్రమైన శైవ క్షేత్రం. ఆ క్షేత్రం గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ఈ ఆలయం చేరటానికి మెరుగైన రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రమే ఆలయానికి చేరుకోవాలి. ఈ ఆలయాన్ని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి.ఆలయ విశేషాలు
కేదార్నాథ్ ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారేశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పశుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పురాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు.ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు యాత్రికులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి. కేదార్నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఇక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత.
కేదార్ నాథ్ ఇలా వెళ్లాలి
రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం చేయాలి. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం ఉంటుంది. కేదార్ నాథ్ కు రావాలంటే హరిద్వార్ నుంచే ప్రత్యేకంగా రవాణా అంటే క్యాబ్ వంటివి మాట్లాడుకోవడం మంచిది. రెండు పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ లకు రూ.1500 నుంచి 3000 మధ్య ఛార్జ్ చేస్తారు. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్కు రావాల్సిందే. ఉదయం 8 గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మళ్లీ మరుసటి రోజు తెల్లవారుజామునే బయల్దేరాలి. రిషికేశ్ నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ మీదుగా అగస్త్యముని, గుప్త్ కాశీ, ఫాటా ద్వారా గౌరీ కుండ్ చేరుకుంటారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వేచిచూడాల్సి రావొచ్చు. వీటన్నింటికీ సిద్ధమై ముందుకు కదలాలి.మంచిని పంచుతారు
ఈ ప్రాంత ప్రజలు చాలా నిజాయితీపరులలని, దొంగతనం అన్న విషయమే ప్రస్తావనకు రాదని చెబుతారు. అంతే కాకుండా యాత్రీకులతో మంచితనంతో గౌరవంగా వ్యవహరిస్తారు. గౌరీకుండ్ నుండి కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదార్నాధుని ఆలయంప్రతిష్టితమై ఉంది. గౌరీకుండ్ 20 నుంచి 30 ఇళ్లున్న ఒక చిన్న ప్రాంతం. ఇది కేదరీనాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. వందకు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పిపంపిస్తారు. అప్పటి వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది.ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 తీసుకుంటారు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది. మామూలు వ్యక్తులెవ్వరికీ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5000 నుంచి రూ. 6000 ఖర్చవుతుంది, నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు. ఈ ధరల్లో ప్రస్తుతం కాస్త మార్పు ఉండవచ్చు. డోలీలో దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది.
ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇది ముందుగా రిజర్వు చేసుకుని చేయాల్సిన ప్రయాణం. ఉత్తరకాశి నుండి ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏమాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు.
ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోధం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈగుడిని అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.