హిందువులు తమ జీవిత పరమార్థంగా భావించేది చార్ధామ్ యాత్ర. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాధ్లను ఉత్తరాఖండ్ చార్ ధామ్లుగా వ్యవహరిస్తారు. ఇక్కడి ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతతీయ నుండి దీపావళి వరకు మాత్రమే భక్తుల సందర్శనార్ధం చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ యాత్రలకు తలుపులు తెరుచుకున్నాయి. వేలాదిగా భక్తులు యాత్ర బాట పట్టారు. ఈ సందర్భంగా చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్నాధ్, బదరీనాధ్ యాత్రల విశేషాల గురించి తెలుసుకుందాం.
చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. ఆ క్షేత్రం గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ఈ ఆలయం చేరటానికి మెరుగైన రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రమే ఆలయానికి చేరుకోవాలి. ఈ ఆలయాన్ని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి.
ఆలయ విశేషాలు
కేదార్నాథ్ ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారేశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పశుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పురాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు.
ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు యాత్రికులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి. కేదార్నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఇక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత.
ఇలా వెళ్లాలి
రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం చేయాలి. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం ఉంటుంది. కేదార్ నాథ్ కు రావాలంటే హరిద్వార్ నుంచే ప్రత్యేకంగా రవాణా అంటే క్యాబ్ వంటివి మాట్లాడుకోవడం మంచిది. రెండు పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ లకు రూ.1500 నుంచి 3000 మధ్య ఛార్జ్ చేస్తారు. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్కు రావాల్సిందే. ఉదయం 8 గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మళ్లీ మరుసటి రోజు తెల్లవారుజామునే బయల్దేరాలి. రిషికేశ్ నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ మీదుగా అగస్త్యముని, గుప్త్ కాశీ, ఫాటా ద్వారా గౌరీ కుండ్ చేరుకుంటారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వేచిచూడాల్సి రావొచ్చు. వీటన్నింటికీ సిద్ధమై ముందుకు కదలాలి.
మంచిని పంచుతారు
ఈ ప్రాంత ప్రజలు చాలా నిజాయితీపరులలని, దొంగతనం అన్న విషయమే ప్రస్తావనకు రాదని చెబుతారు. అంతే కాకుండా యాత్రీకులతో మంచితనంతో గౌరవంగా వ్యవహరిస్తారు. గౌరీకుండ్ నుండి కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదార్నాధుని గుడి ప్రతిష్టితమై ఉంది. గౌరీకుండ్ 20 నుంచి 30 ఇళ్లున్న ఒక చిన్న ప్రాంతం. ఇది కేదరీనాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. వందకు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పిపంపిస్తారు. అప్పటి వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది.
ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 తీసుకుంటారు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది. మామూలు వ్యక్తులెవ్వరికీ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5000 నుంచి రూ. 6000 ఖర్చవుతుంది, నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు. ఈ ధరల్లో ప్రస్తుతం కాస్త మార్పు ఉండవచ్చు. డోలీలో దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది.
ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇది ముందుగా రిజర్వు చేసుకుని చేయాల్సిన ప్రయాణం. ఉత్తరకాశి నుండి ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏమాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు.
ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోధం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈగుడిని అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.
బదరీ యాత్ర విశేషాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న గర్హ్వాల్ కొండల్లో, అలకనందా నదీ తీరంలో హిమాలయాల్లో 3133 మీటర్ల ఎత్తులో ఉన్న బదరీనాధ క్షేత్రం 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది, ఆదిశంకరాచార్యులచే నిర్మితమైనది. పురాణాలలో బద్రి లేదా బదరికాశ్రమంగా పేర్కొనబడింది. శ్రీమన్నారాయణుడు ఆశ్రమజీవితం గడిపిన ప్రాంతంగా బద్రినాథ్ పురాణ ప్రాధాన్యతను సంతరించు కుంది. భూలోకవాసులను కటాక్షించడానికి గంగానది భువికి దిగిన సందర్భంలో ఆ నదీమతల్లి శక్తిని భరించడం భూదేవికి కష్టం కనుక 12 భాగాలుగా విడిపడి భూలోకాన్ని చేరింది. ఆ 12 భాగాల్లో అలకనందా నది కూడా ఒకటిగా పురాణాలు చెప్తున్నాయి. బదరీనాథ్ చైనా, టిబెట్ సరిహద్దుల దగ్గరిలో ఉంటుంది.
ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని స్కాంద పురాణంలో పరమేశ్వరుడు తన కుమారుడైన కుమారస్వామికి వర్ణించినట్టు తెలుస్తోంది. బదరీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని, శివుడు కుమారస్వామికి చెప్పినట్టు పురాణాల ఆధారంగా తెలుస్తోంది. కృతయుగంలో ముక్తిప్రద అని, త్రేతాయుగంలో యోగసిద్ధిద అని ద్వాపర యుగంలో విశాల అనే పేర్లతో ఈ క్షేత్రం భాసిల్లిందని చెపుతారు. ఇక్కడి రేగు చెట్ల నుండి అమృతం స్రవించిందని, అందుకే దీన్ని బదరీ క్షేత్రంగా పిలుస్తారని కూడా పురాణేతిహాసాల కథనాల ద్వారా అవగతమవుతోంది. ఒక్క బదరీని సందర్శించినంత మాత్రా ననే అన్ని లోకాల్లోని తీర్థక్షేత్రాలను సందర్శించిన ఫలితం లభిస్తుందన్నది ఈ క్షేత్ర మహిమా సారాంశంగా చెప్పవచ్చు.
బదరీ నాధునిగా అవతరించిన శ్రీమహావిష్ణువు
వైకుంఠంలో మహావిష్ణువు జాడ తెలియక సతమతమవుతున్న లక్ష్మీదేవి ముల్లోకాలను వెతుకుతూ హిమాలయాల్లో తపస్సమాధిలో మునిగి ఉన్న విష్ణుమూర్తి జాడను తెలుసుకుంటుంది. తీవ్రమైన హిమపాతం కురుస్తుండగా తపస్సు ఆచరిస్తున్న పతిని గాంచి హిమపాతము తపస్సుకు భంగం కలిగించకుండా తాను ఒక బదరీ వృక్షం(రేగుచెట్టు) గా మారి స్వామిపై హిమపాతం కురవనీయకుండా అడ్డుకుంటుంది. కొంతకాలానికి విష్ణుమూర్తి నిర్మల మనస్కుడై, శాంత హృదయుడై ఇహలోకంలోకి ప్రవేశిస్తాడు. ఈ తరుణంలో తనను తపోకాలంలో హిమపాతం నుంచి బదరీవృక్ష రూపంలో రక్షిస్తూ వచ్చిన లక్ష్మీదేవిని గాంచి తాను తపస్సు చేసిన ప్రాంతం లో తాను బదరీనాధునిగా భక్తుల పూజలందు కుంటానని చెప్పాడని పురాణగాధలు చెప్తున్నాయి.
ఈ ఆలయ ద్వారాలను వైశాఖమాసంలో వచ్చే శుక్ల తదియ నాడు తెరుస్తారు. యాత్ర ఆరు నెలల పాటు కొనసాగు తుంది. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. అయితే ఆలయ తలుపులు మూసి ఉంచిన ఆరునెలలు ఆలయంలో వెలిగించిన అఖండదీపం అలా వెలుగుతూనే ఉంటుంది. మరుసటి సంవత్సరం ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంలో అఖండ దీపాన్ని దర్శించు కోవడానికి లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుండి తరలివస్తారు. ఆలయాన్ని మూసివేసిన కాలంలో స్వామి మూర్తులను బదరీ సమీపంలోని ఆణిమఠ్లో ఉండే దేవాలయంలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. దీనినే వృద్ధబదరీ అని కూడా వ్యవహరిస్తారు.
యాత్ర ఇలా చేయాలి...
చమోలి జిల్లాలో హిమాలయాల వద్ద ఉన్న దేశసరి హద్దుకు దగ్గరగా ఉండే ప్రాంతంలో అలకనందా నది దాటిన తర్వాత ముందుగా ఆదికేదార్ మందిరం ఉంటుంది. దాని తరువాత నారద కుండం, వెంటనే ఉష్ణ కుండం తర్వాత బదరీనాథ్ వరుసగా ఎదురయ్యే ప్రాంతాలు. బదరీయాత్ర పూర్తి చేసుకునే ముందు భక్తులు నారదకుండాన్ని దర్శించుకోవాలి. తరువాత ఉష్ణకుండంలో స్నానం చేసి ఆది కేదారేశ్వరుని దర్శించుకుని చివరిగా బరదీనాథ్లోని విష్ణుమూర్తిని కనులారాగాంచి యాత్రను ముగిస్తారు. బదరీ చేరుకోవాలంటే ముందుగా ఢిల్లీ చేరుకుని అక్కడినుంచి యాత్ర ముందుకు సాగించాలి. ఢిల్లీకి సుమారు 520 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఢిల్లీ మీదుగా హరిద్వార్, ఋషీకేశ్ వరకూ రైలు మార్గం ఉంది. అక్కడినుండి పూర్తిగా అడవులు, కొండలు మధ్యగా రోడ్డు మార్గం గుండా ప్రయాణం సాగించాలి. దేవప్రయాగ, ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నంద ప్రయాగ, చమోలి, పిపల్కోటి, జోషీమఠ్, గోవింద్ ఘాట్, పాండుకేశ్వర్ ప్రాంతాలమీదుగా బదరీయాత్ర సాగుతుంది. ఈ మార్గంలోనే హేమకుండ్ సాహెబ్ అని సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం కూడా ఉంది.
వీటిని కూడా చూసి రండి...
బదరీనాథుని ఆలయ ముఖ ద్వారం సమీపంలో లక్ష్మీదేవి ఆలయం కనిపిస్తుంది. బదరీ పరిసరాల్లో వేదాంత దేశిక, రామానుజాచార్యుల మందిరాలు కూడా ఉన్నాయి. బదరీ నుంచి కొంచెం ముందుకు సాగితే ఇవి కనిపిస్తాయి. బదరీ పరిసర ప్రాంతాల్లో నరశిల, నారాయణశిల, నారదశిల, గరుడశిలలు సందర్శించవచ్చు. ఇవి ఉష్ణకుండం దగ్గరగా ఉంటాయి. అలకనందా నది దాటిన వెంటనే వరాహశిలను కూడా సందర్శించవచ్చు. బదరీ గ్రామంలో సతీదేవి యొక్క 108 శక్తిపీఠాలలో ఒక్కటైన ఊర్వశి మందిరం ఉంది. ఇది కూడా ఈ ప్రాంత సందర్శనీయ స్థలాల్లో ప్రముఖమైంది.
ఘంటాకర్ణుని దర్శనం
బదరీనాథ్ ఆలయానికి కొద్ది దూరంలోనే ఘంటాకర్ణుడనే రాక్షసుని విగ్రహం కనిపిస్తుంది. రావణాసురుడు తన సోదరుడైన కుబేరునిపైకి యుద్ధానికి వెళ్ళినపుడు ఘంటాకర్ణుని సైన్యాధికారిగా నియమించుకున్నాడు. ఆ యుద్ధంలో రావణుడు గెలిచి కుబేరుని రాజ్యానికి ఘంటాకర్ణుని పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. అయితే తన రాజ్యాన్ని తిరిగి కుబేరునికే అప్పగించ సంకల్పించి తాను శివధ్యానంలో శేషజీవితాన్ని గడుపుతానని ఆయన చెపుతాడు. కానీ కుబేరుడు ఓడిన రాజ్యాన్ని తిరిగి పొందడం వీరుల లక్షణంకాదంటూ తిరస్కరించి బదరీనాథ్ కు సమీపంలో భారతదేశ సరిహద్దు గ్రామంగా పిలిచే మానా గ్రామంలోని కొండల్లో ఒక పర్వత రూపంలో ఉండిపోయాడు. అనంతరం ఘంటాకర్ణుడు దేవతలకు విధేయుడిగా పరిపాలన సాగించి, శివుని మెప్పించి సాక్షాత్కారం పొందాడు. తనను సందర్శించిన వారికి కూడా మోక్షప్రాప్తి కలిగించాలని ఘంటాకర్ణుడు శివుని ద్వారా వరాన్ని పొందాడు.

ఆది కేదార్
కేదార్నాథ్ కన్నా ముందు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఆదికేదార్లో నివాసముండేవాడట. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వికల మనస్కుడైన విష్ణుమూర్తి తపస్సు చేసుకునేందుకు ఒక అనువైన ప్రదేశాన్ని అన్వేషిస్తాడు. ఈ క్రమంలో మునులను సంప్రదించగా ఆదికేదార్ ప్రాంతాన్ని వారు సూచిస్తారు. కానీ అప్పటికే శివపార్వతులకు అది నివాసస్థలమై యుందన్న విషయాన్ని గ్రహించి ఎట్టి పరిస్థితుల్లోను ఆది కేదార్ ప్రాంతాన్ని తపస్సుకై తన చేజిక్కించుకోవాలని సంకల్పించి మాయోపాయం పన్నుతాడు.
పార్వతీ పరమేశ్వరులు విహారానికై నిత్యం సంచరించే ప్రాంతంలో విష్ణుమూర్తి ఓ బాలుని రూపంలో రోదిస్తూ వారి కంటపడతాడు. పార్వతీదేవి బాలుని చూసి ముచ్చటపడి అక్కున చేర్చుకుని తనతో తమ ఆశ్రమానికి తీసు కెళ్తుంది. మరునాడు యధావిధిగా శివపార్వతులు విహారానికి బయలుదేరిన వేళ మహావిష్ణువు తపోధ్యానంలోకి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చిన శివపార్వతులు తపో ధ్యానంలో మునిగి ఉన్న విష్ణుమూర్తిని చూసి, జరిగిన విషయాన్ని గ్రహించి నొచ్చుకుంటారు. విష్ణుమూర్తికి ఇష్టమైన శనగపప్పు ఆదికేదార్ ప్రాంతంలో పండకూడదంటూ శపించి ప్రస్తుతం కేదార్నాధ్ ఉన్న ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోతారని కథనం. బదరీకి సమీపంలో కిలోమీటరు దూరంలో పార్వతికి బాలుని రూపంలో విష్ణుమూర్తి లభించిన చోటును కూడా చూడవచ్చు.
యాత్రలో జాగ్రత్తలు
బదరీయాత్ర ఓ సుదీర్ఘమైన యాత్ర. ఈ యాత్ర చేయాలంటే మానసిక, శారీరక బలం చాలా అవసరం. ఢిల్లీ నుంచి యాత్రా ప్రాంతమంతా అతి శీతల ప్రాంతం. బదరీ వైపు వెళ్తున్నకొద్దీ హిమపాతాలకు నెలవైన ప్రాంతమే. కాబట్టి మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్లో శరీరాన్ని కొద్ది రోజులు ఉంచగలిగే వ్యాయామం అత్యంత ఆవశ్యకం. తదనుగుణంగా వైద్యుల సలహాలను కూడా తీసుకోవలసి ఉంటుంది. అతి శీతల ప్రాంతంలో సంచరించేందుకు వీలుగా చలి కోట్లు, ఇతర దుస్తులను సమకూర్చుకోవాలి. సాధారణ స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువాలు వంటివి సరిపోవు. మరీ ముఖ్యంగా యాత్ర ప్రాంతమంతా ప్రమాదాలకు నెలవైన ప్రాంతం.
ఇటీవలే అంటే 2013లో సంభవించిన వరదలు మన కళ్ళముందే కదలాడు తున్నాయి. గత సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో స్వల్పంగా వరదలు సంభవించాయి. ఈఏడాది ఇప్పటికే పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొండచరియలు విరిగిపడిన సంఘటనలో స్వల్పంగా యాత్రకు ఆటంకం ఏర్పడిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండాలి. మీ యాత్ర గురించిన వివరాలను మీ బంధువర్గానికి తెలియచేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా వెళ్ళి బదరీనాథుని దివ్యదర్శనాన్ని పొంది మహావిష్ణువు ఆశీస్సులు పొందిరండి మరి ఇక ఆలస్యమెందుకు...