తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, చక్రత్తాళ్వార్ ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
[gallery columns="2" size="full" ids="2046,2047"]
అక్కడ స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత టిటిడి పరిపాలనా భవనం ఎదుట గల పి.ఆర్.తోటకు వేంచేశారు.
సాయంత్రం 5 గంటలకు స్వామివారు పి.ఆర్.తోట నుండి ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9.10 గంటల నుండి 9.30 గంటల వరకు ధ్వజావరోహణం జరుగనుంది.
Source