తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ మార్గాళి నీరాటోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 13వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. ఆస్థానం చేపట్టారు. ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు.
సాయంత్రం 4.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.
Source