తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో చండీయాగం శనివారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబరు 28 నుండి నవంబరు 5వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) వైభవంగా జరుగనుంది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.
కాగా, గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.