టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం



టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో మంగళవారం ఉదయం నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా టిటిడి స్థానికాలయాలను సోమవారం సాయంత్రం 4.30 గంటలకు మూసివేసిన విషయం విదితమే.

తిరుచానూరు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 4 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేశారు. అనంతరం 7.30 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.

శ్రీనివాసమంగాపురం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 5 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని మంగళవారం ఉదయం 5.30 గంటలకు తెరిచారు. శుద్ధి తరువాత భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

గోవిందరాజస్వామి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 4 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

కోదండరామస్వామి

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 5 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేపట్టారు. ఉదయం 8 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

కపిలేశ్వరస్వామి

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

అప్పలాయగుంట

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఉదయం 4.30 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.