ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? ఈ పండుగ ఎలా చేస్తారు?

హిందూ మత విశ్వాసాల ప్రకారం, పౌర్ణమి తిథులలో జ్యేష్ఠ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన సముద్ర స్నానం, ప్రవహించే నదుల్లో స్నానాలు చేస్తారు. నిండు చంద్రుడు పౌర్ణమి తిథి వేళ ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి ఈ పేరు వచ్చిందని పండితులు చెబుతారు. జూన్ 11న  జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పున్నమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజను చేస్తారు. ఇది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ సమయంలో తమ పొలాల్లో ఎద్దులతో నాగలితో దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. ఈ వేడుకను శాస్త్ర పరంగా ప్రారంభిస్తారు అంటే ఈ పర్వదినాన వ్వవసాయ పనులు ప్రారంభించడం అని అర్థం. ఈ సందర్భంగా ఏరువాక పున్నమి రోజునే వ్యవసాయ పనులను ఎందుకు ప్రారంభిస్తారు.. ఏరువాక పౌర్ణమి విశిష్టతలేంటో తెలుసుకుందాం...

ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని, సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని జరుపుకుంటారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్ష బుుతువు ప్రారంభం కాగానే, రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కట్టేకాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. అనంతరం కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపిస్తారు. పొలానికి వెళ్లి భూమాతకు ఆరాధిస్తారు. అలాగే ఏరువాక పున్నమి రోజున సాయంకాలం వేళ రంగు రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి, డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. అనంతరం ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.

గుహ్యసూత్రాల్లో...

వేద కాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అధర్వవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగ గురించి ప్రస్తావించారు.

సీతాయజ్ఞం

విష్ణు పురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించబడింది. ఇందులో సీత అంటే నాగలి అని అర్థం. 'వప్ప మంగళ దివసం'.. 'బీజవాపన మంగళ దివసం'...'వాహణ పుణ్ణాహ మంగళమ్‌'...'కర్షణ పుణ్యాహ మంగళమ్‌..' అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు. శుద్ధోదనమహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా శాస్త్రాలలో వివరించబడింది. హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నల ప్రస్తావన వచ్చింది.

ఎడ్ల పండుగ..

ఏరువాక పున్నమి రోజున రైతులందరూ ఊరి బయటకు వెళ్లి చెర్నాకోలతో తోరాలను కట్టి, ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎడ్ల మెడలో కడతారు. అనంతరం ఎడ్ల పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పంట పొలాలు బాగా పండుతాయని, పశు సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.