
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి.

వైభవోపేతంగా రెండో రోజు పద్మావతి పరిణయోత్సవం
శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన వైశాఖశుద్ధ దశమి తిథి అలనాటి వివాహ సుముహూర్త దినమని పురాణ ప్రశస్తి.
కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజుకు ప్రత్యేకత ఉంది.
బుధవారం సాయంత్రం శ్రీ మాలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట వేరు వేరు బంగారు తిరుచ్చీలపై శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు.
మొదటిరోజు మాదిరే శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో చతుర్వేద పారాయణం అనంతరం, అమృత వర్షిణి, హిందూస్థాని,ఆనంద భైరవి, కళ్యాణి, దర్బార్ రాగాలలో వాయిద్య విన్యాసాలు, శ్రీ పద్మావతి శ్రీనివాస దివ్య వివాహ ఘట్ట హరికథా పారాయణం, అన్నమాచార్య సంకీర్తన వైభవం ఇత్యాది కార్యక్రమాలు రసరమ్యంగా నిర్వహించారు.
ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయలోకి ప్రవేశం చేశారు.
ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.