అంతకుముందు ఉదయం 5.30 నుండి 9.00 గంటల వరకు ధ్వజప్రతిష్ఠ, రక్షాబంధనం, భేరీతాడనం, నవసంధి, బలిహారణం, తిరుమాడ వీధి ఉత్సవం సాగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షించి, 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారని ప్రతీతి.
ఈ రోజు రాత్రి 7 నుండి 9 గం.ల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
స్థల పురాణం – ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవి కలియుగ దైవం శ్రీనివాసుల పరిణయానంతరం ఆకాశరాజు స్వర్గస్థుడు కాగా, అతని కుమారుడు వసుదాసుడు సంతానహీనుడై పూర్వము తమ పూర్వులకు అర్థరాజ్యం ఇచ్చిన నారాయణరాజు మునిమనుమడైన వేంకటరాజునకు నారాయణపుర రాజ్యమును అప్పగించి తాను వేంకటాచలమున తపస్సుచేసి శ్రీనివాసుని పాదారవిందముల ప్రాప్తి పొందగోరెను. వేంకటరాజు వంశమున వేంకట పెరుమాళ్రాజు తన పరిపాలన కాలమందు ఈ కార్వేటినగర నిర్మాణమును గావించి తిరుమలలో శ్రీ వేంకటాచలపతితో కూడి పూజింపబడుచున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవతామూర్తులను తెప్పించి శ్రీ వేఖానసులవారిచే ప్రతిష్టింపజేసెను. ఈ ఆలయ నిర్వహణను రాజుల పరిపాలనానంతరం 1936 సంవత్సరం నుండి దేవాదాయ శాఖ నిర్వహించి, తదుపతి 1989 ఏఫ్రిల్ 10న తిరుమల తిరుపతి దేవస్థానమునకు అప్పగించబడినది. ఈ ఆలయంలో స్వామివారు సంతాన వేణుగోపాలస్వామిగా ఎంతో ప్రసిద్ధి పొందినారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
- 20-05-2025 : ఉదయం – చిన్నశేష వాహనం, సాయంత్రం – హంస వాహనం
- 21-05-2025 : ఉదయం – సింహ వాహనం, సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
- 22-05-2025: ఉదయం – కల్పవృక్ష వాహనం, సాయంత్రం – ఆర్జిత కళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం
- 23-05-2025: ఉదయం – పల్లకీపై మోహినీ అవతారం, సాయంత్రం – గరుడ వాహన సేవ
- 24-05-2025: ఉదయం – హనుమంత వాహనం, సాయంత్రం – సా – వసంతోత్సవం, రాత్రి – గజ వాహనం
- 25-05-2025: ఉదయం – సూర్యప్రభ వాహనం, సాయంత్రం – చంద్రప్రభ వాహనం
- 26-05-2025: ఉదయం – రథోత్సవం, సాయంత్రం – అశ్వవాహనం
- 27-05-2025: ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 22వ తేదీ సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.