ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన ఉడిపి పలిమారు మఠాధిపతి

ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని జనవరి 15 బుధవారం రోజున ఉడిపిలోని పలిమారు మఠాధిపతి శ్రీశ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆయనకు అర్చకులు స్వాగతం పలికి నమూనా ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం ఆయన స్వామివారి ఊంజల్ సేవలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారు వైకుంఠం నుండి తిరుపతికి వచ్చారని, ఇప్పుడు ఉత్తరాది భక్తుల కోసం మహా కుంభ మేళా నిర్వహించే పవిత్ర స్థలమైన ప్రయాగ్ రాజ్ కు విచ్చేశారని చెప్పారు. భక్తులందరూ శ్రీవారిని దర్శించుకుని వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.