చాతుర్మాస్య దీక్ష ప్రారంభించనున్న తిరుమల పెద్దజీయర్‌స్వామి

చాతుర్మాస్య దీక్ష ను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి జూలై 29వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం దీక్ష సంకల్పం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస్య దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలో రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామికి పెద్దమర్యాద చేస్తారు.

తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి తిరుమల శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం ప్రక్కన ఉన్న జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజియ్యంగారు మరియు ఇతర శిష్యబృందంతో కూడి ముందుగా శ్రీవరాహస్వామివారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు.

శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టిటిడి కార్యనిర్వహణాధికారి, ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు. శ్రీ జియ్యంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీ పెద్ద జియ్యంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ చిన్న జియ్యంగారికి నూల్‌ చాట్‌ వస్త్రాన్ని బహుకరిస్తారు.

Source