ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6.00 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి పి. వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రీ సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రశాంత్, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన అధ్యయనోత్సవాలు
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17వ తేదీ బుధవారం అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు 24 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
మాఘ మాసంలో ఈ ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 27న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 2న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 6న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.
Source