విశ్వంలోని సకలప్రాణి కోటికి మృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ తిరుపతి కపిలతీర్థం ప్రాంగణంలో జరుగుతున్న అకాల మృత్యుహరణ మహాయజ్ఞం బుధవారం ఉదయం మహా పూర్ణాహూతితో ముగిసింది. డిసెంబరు 30వ తేదీ నుండి ఈ మహాయజ్ఞం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వేద పండితులు ప్రతి రోజు శ్రీ మహామృత్యుంజయ మంత్రాన్ని లక్షసార్లు పఠించడం జరిగింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 51 మంది కృష్ణయజుర్వేద పండితులు, ఎస్వీ వేద వర్సిటీ ఆచార్యులు యజ్ఞం, జపం, తర్పణం క్రతువులు నిర్వహించారు. కృష్ణ యజుర్వేదంలోని భట్టభాస్కరుడు రచించిన శ్రీరుద్రంలోను, శాంతికల్పం అనే గ్రంథంలోను ఇది ఉంది. ఈ యాగం వల్ల మృత్యుదోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.