క్షీరాబ్ది ద్వాదశి 2018- క్షీరాబ్ది శయన వ్రత పూజా విధానము

కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని అందరూ తప్పనిసరిగా ఆచరించాలి. ఈ పూజ చేయడం కోసం ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకుని, ఈశాన్య మూలలో స్థలమును అలికి , బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి, విష్ణమూర్తి లక్ష్మీ దేవి కలిసి ఉన్న పటమును గాని, విగ్రహాన్ని గాని ఒక పీఠముపై ఏర్పాటు చేయాలి. ఆ పీఠమునకు పసుపు, కుంకుమలు అలంకరించి, వరిపిండితో అష్టదళ పద్మాన్ని, శంఖం, చక్రం, స్వామి వారి పాదాలను కూడా వేసి ఆ పీఠముపై స్వామిని ఆశీనులను చేయాలి. పూజ చేసే వారు తూర్పు వైపుగా కూర్చోవాలి.

ఒక ఇత్తడి లేక రాగి పళ్ళెములో బియ్యము పోసి దానిపైన ఒక తమలపాకులో పసుపు గణపతిని ఉంచి దానికి కుంకుమ బొట్టు పెట్టాలి. పూజకు కావలసిన వస్తువులను అన్నింటినీ ముందుగానే అమర్చుకోవాలి. దీపారాధన చేయుటకు వెండి గాని, ఇత్తడిగాని, మట్టిది ప్రమిద గాని తీసుకుని మూడు వత్తులు అందులో వేయాలి. దానిలో ఒత్తులు తడిసేలా ఆవునెయ్యి పోయాలి. ఒక కాడ వత్తును ఆవు నెయ్యితో తడిపి హారతి వెలిగించుకునే పళ్ళెంలో వేసి వెలిగించి ఆ వత్తితో మనం ముందుగా కుందిలో వేసిన వత్తులను వెలిగించాలి. అంటే అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించకూడదు. దీపారాధన నైరుతి దిశలో చేయవలెను. విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం కనుక ఆవునెయ్యి అయితే శ్రేష్టం. ఆవునెయ్యి లేకపోతే కొబ్బరినూనె కూడా వాడవచ్చు.
తరువాత కుంది నిండా నెయ్యి వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత దీపము కింద అక్షతలు వేసి దీపారాధనకు నమస్కారము చేయవలెను.ఈ విధంగా దీపం వెలిగించిన తరువాత గంటను మ్రోగిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను .

ఘంటా నాదము

శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటార వం తత్ర దేవతా హ్వాహాన లాంఛనమ్
తరువాత ఆచమనము చేయాలి. మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. కలసి పూజకు విడిగా ఒక ప్రత్యేక పాత్ర వినియోగించాలి. ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను. క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపదానము అతి ముఖ్య మైనది . ఆ రోజు దీపదానము చేయువారు స్వర్గ ప్రాప్తిని పొందుదురు. దీపమునకు ఆవు నెయ్యి ఉపయోగించ వలెను అది దొరకనిచో మంచి నూనె వాడవచ్చును. మంచి నూనె అంటే వేరుశనగ గాని, నువ్వులనూనె కాని వాడాలి. అంతేకాని పామాయిల్ వంటి నూనెలో వాడకూడదు. ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు మోక్ష ప్రాప్తి కలుగును.

పూజకు కావలసిన వస్తువులు 

తమ శక్తి కొలది బంగారముతో నైనను ,వెండితో నైననూ లేక మట్టితో నైనను చేసిన లక్ష్మీ నారాయణుల యొక్క ప్రతిమ, కొబ్బరికాయలు ,
బెల్లము, ఖర్జూరము, చెరకు, పళ్ళు ,పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి
కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె , అగరువత్తులు, వస్త్రం, యజ్ఞోపవీతములు, ప్రత్యేక నివేదనకు పిండివంటలు మొదలగునవి.
పిమ్మట పూజ చేసేవారు ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం
చేయాలి .ఈ నామములు మొత్తం 24 కలవు.

  • ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి

  •  " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి

  •  " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత

  • " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .

  •  " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .

  • " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .

  • "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .

  • " ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి

  •  ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .

  • ఓం పద్మనాభాయ నమః మన పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .

  •  ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .

  • ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .

  • ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .

  • ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః నేత్రాలు తాకవలెను .

  • ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను

  • ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .

  • ఓం జనార్దనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .

  • ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .

  • ఓం హరయే నమః

  • ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమమూపురమును కుడి చేతితోను తాకి ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి, వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను .


ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను.
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||


ప్రాణాయామమ్య

ఓం భూః ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

సంకల్పము 

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), గంగా గోదావర్యోః మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. దక్షిణాయనే .....ఋతు కార్తీక మాసే శుక్ల పక్షే ద్వాదశి తిధౌ ......వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా క్షీరాబ్ధి శయన వ్రతాభ్యాం కర్మ కరిష్యే . సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్యర్ధం గణాధిపతి పూజాం కుర్యాత్. తతః తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ముద్దిశ్య తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ( కుడిచేయి ఉంగరపు వేలితో కలశంలోని నీటిని తాకవలెను) పిదప కలశారాధనను చేయవలెను.

కలశ పూజ

వెండి, రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును  తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ  పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని  పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన,  మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. పూజచేసేవారు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .

ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

కలశస్య ముఖే విష్ణు : కంఠే రుద్ర స్సమాశ్రితాః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః


శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.


ఇక్కడ
ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) ,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,ఆకుతో గాని చల్లాలి .


మార్జనము

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||

అని
పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణ  ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు .  స్థిరోభవ, వరదోభవ ,సుముఖోభవ ,సుప్రసన్నోభవ. తరువాత ఇలా చదువుతూ  విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .

శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః
వక్ర తుండ శ్శూర్ప కర్ణో హీరంభః స్కంద పూర్వజః
షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి
విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్త స్యన జాయతే ||

పిదప
షోడశోపచార పూజను చేయవలెను. షోడశోప చారములనగా ఆవాహన ,ఆసనం, అర్ఘ్యం ,పాద్యం ,ఆచమనీయం ,స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం ,ప్రదక్షణములు మొదలగునవి.

షోడశోపచార పూజా ప్రారంభః


ధ్యానం :

శ్లో || దక్షిణాగ్ర కరే శంఖం పద్మంత స్వాప్యదః కరే
చక్ర మూర్ధ్వ కరే నామే గదాంత స్యాయ్సదః కరే
దదానాం సర్వ లోకేశం సర్వా భరణ భూషితం
క్షీరాబ్ధి శయనం దేవం ధ్యాయేన్నారాయణ ప్రభుం

ఓంశ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ధ్యాయామి -ధ్యానం సమర్పయామి అని విష్ణువును మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.

ఆవాహనం

శ్లో || ఆవాహయామి దేవత్వం పూజార్ధ మిహహే ప్రభో |
ఆగచ్ఛ దేవ దేవేశ సర్వ దేవ గణై స్సహ ||

ఓంశ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనార్ధం  అక్షతాం సమర్పయామి. అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం  అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.

ఆసనం :

శ్లో || అనేత హార సంయుక్తం నానామణి విరాజితం
రత్న సింహాసనం దేవ ప్రీత్యర్ధ ప్రతి గృహ్యతాం ||

ఓంశ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి . సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి .దేవుడు కూర్చుండుటకై మంచి  బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం :

శ్లో || నిష్కళంక గుణా రాధ్య జగత్త్రితయ రక్షక
అర్ఘ్యం గృహాణ మద్దత్తం శుద్ధోదక వినిర్మితం

ఓంశ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి .దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనసున తలుస్తూ  ,ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

పాద్యం 

శ్లో || పద్మనాభ సురారాధ్య పాదాంభుజ శుభ ప్రద
పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం

ఓంశ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పాదౌ : పాద్యం సమర్పయామి.దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను .

ఆచమనీయం 

శ్లో|| సర్వ రాధ్య నమస్తేస్తు సంసారార్ణవ తారక
గృహాణ దేవ మదత్తం పరమాచామనీయకం

ఓంశ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి  అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్లిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.

అర్ఘ్యం , పాద్యం, ఆచమనం మొదలగువాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను .అరివేణంలోవదలరాదు.

మధుపర్కం :

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి  అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ ,ఈ  మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులోగుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకున్న  దాన్ని మధుపర్కం అంటారు.)

పంచామృత స్నానం

శ్లో|| స్వపాద పద్మ సంభూత గంగా శోదిత విష్ణవ
పంచామృతై స్నాపయిష్యే తతః శుద్దోద కేనేచ

ఓం శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి .అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి , ఆవుపాలు ,ఆవు పెరుగు ,తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.

శుద్దోదక స్నానం 

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

వస్త్ర యుగ్మం 

శ్లో|| విర్యు వ్విలాస రమ్యేణ సర్వ వస్త్రేణ సంయతం
వస్త్ర యుగ్మం గృహణేదం భక్త్యా దత్తం మయా ప్రభో

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మ మనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో
అద్దినచో అది వస్త్రమగును.ఇటువంటివి రెండు చేసుకొనవలెను )స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం :

శ్లో || నారాయణ నమస్తేస్తు నాక నాధాధి పూజితం
స్వర్ణో పవీతం మద్దతం స్వర్ణ దం ప్రతి గృహ్యాతాం

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు ,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ
పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించ వలెను.

గంధం 

శ్లో || రమాలింగన సంసక్త కాశ్మీర వక్షసే :
కస్తూరి మిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః రమ్య గంధం సమర్పయామి. ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి  ప్రతిమపై చల్లవలెను.

అక్షతలు 

శ్లో || అక్షతాన్ ధవళాన్ శుభ్రాన్ పక్షి రాజ ధ్వజా వ్యయ
గృహాణ దేవ దేవేశ కృపయా భక్త వత్సల

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి . (అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను ) అక్షతలు తీసుకుని స్వామివారి ప్రతిమపై చల్లవలెను.

పుష్ప సమర్పణ :
శ్లో || బిల్వపు దళ తులసీ దళ మల్లికాభి ,
స్త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవః

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి
స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను. పిదప అధాంగ పూజను చేయవలెను .ఈ
క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని ,పసుపు కుంకుమలతో గాని స్వామిని
పూజించవలెను.

అధాంగపూజ

కేశవాయ నమః పాదౌ పూజయామి , నివృత్తిని మేషాది కాలాత్మనే నమః జంఘే పూజయామి ,విశ్వరూపాయ నమః జానునీ పూజయామి ,జగన్నాధాయనమః గుహ్యం పూజయామి , పద్మనాభాయ నమః నాభిం పూజయామి, కుక్షి స్థాకిల విష్టపాయ నమః కుక్షిం పూజయామి , లక్ష్మీ విలసద్వక్షసే నమః వక్షం పూజయామి ,చక్రాది హస్తాయ నమః హస్తాన్ పూజయామి,
కంబు కంఠాయ నమః కంటం పూజయామి , చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి , వాచస్పతయే నమః వక్త్రం పూజయామి , కేశవాయ నమః నాసికం పూజయామి , నారాయణే నమః నేత్రౌ పూజయామి , గోవిందాయ నమః శ్రోత్రౌ పూజయామి, నిగమ శిరో గమ్యాయ నమః శిరః పూజయామి , సర్వేశ్వరాయ నమః సర్వాణ్యం గాని పూజయామి.

 

తరువాత అష్టోత్తర శతనామావళి పూజ . దీని యందు 108 మంత్రములుండును. ఈ మంత్రములను చదువుచూ
పుష్పములతో కాని ,పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను .

అష్టోత్తర శతనామావళి


ఓం విష్ణవే నమః ;
ఓం లక్ష్మీ పతయే నమః ;
ఓం కృష్ణాయ నమః ;
ఓం వైకుంటాయ నమః ;
ఓం గరుడ ద్వజాయ నమః ;
ఓం పరబ్రహ్మణే నమః ;
ఓం జగన్నాదాయ నమః ;
ఓం వాసుదేవాయ నమః ;
ఓం త్రివిక్రమాయ నమః
; ఓం హంసాయ నమః ;
ఓం సమగ్ర మదనాయ నమః ;
ఓం హరయే నమః ;
ఓం శుభప్రదాయ నమః ;
ఓం మాధవాయ నమః ;
ఓం పద్మనాభాయ నమః ;
ఓం హృషీ కేశాయ నమః ;
ఓం సనాతనాయ నమః ;
ఓం నారాయణాయ నమః ;
ఓం మధు పతయే నమః ;
ఓం రతా రోక్ష్య వాహనాయ నమః ;
ఓం దైత్యాంత కాయ నమః ;
ఓం శింసుమారాయ నమః ;
ఓం శ్రీ కరాయ నమః ;
ఓం కపిలాయ నమః ;
ఓం పుండరీ కాక్షాయ నమః ;
ఓం స్థితి ప్రత్యై నమః ;
ఓం పరాత్పరాయ నమః ;
ఓం వనమాలినే నమః ;
ఓం యజ్ఞ రూపాయ నమః ;
ఓం చక్ర రూపాయ నమః ;
ఓం గదాధరాయ నమః ;
ఓం ఉపేంద్రాయ నమః ;
ఓం కేశవాయ నమః ;
ఓం భూమజనకాయ నమః ;
ఓం శేష శాయినే నమః ;
ఓం చతుర్బుజాయ నమః ;
ఓం పాంచజన్య ధరాయ నమః ;
ఓం శ్రీ మతే నమః ;
ఓం శార్ జ్ఞ పాణాయ నమః ;
ఓం జనార్ధనాయ నమః ;
ఓం పీతాంబర ధరాయ నమః ;
ఓం దేవాయ నమః ;
ఓం సూర్య చంద్ర విలోచనాయ నమః ;
ఓం మత్స్య రూపాయ నమః ;
ఓం కూర్మ తనవే నమః ;
ఓం క్రోధరూపాయ నమః ;
ఓం హృషీ కేశాయ నమః ;
ఓం వామనాయ నమః ;
ఓం భార్గవాయ నమః ;
ఓం రామాయ నమః ;
ఓం హలినే నమః ;
ఓం కల్కినే నమః ;
ఓం హరా ననాయ నమః ;
ఓం విశ్వంభరాయ నమః ;
ఓం ధృవాయ నమః ;
ఓం దత్తాత్రేయాయ నమః ;
ఓం అచ్యుతాయ నమః ;
ఓం అనంతాయ నమః ;
ఓం రధ వాహనాయ నమః ;
ఓం ముకుందాయ నమః ;
ఓం ధన్వంతరే నమః ;
ఓం శ్రీనివాసాయ నమః ;
ఓం ప్రద్యుమ్నాయ నమః ;
ఓం పురుషోత్తమాయ నమః ;
ఓం శ్రీ వత్స కౌస్తుభ ధరాయ నమః ;
ఓం మురారాతయే నమః ;
ఓం అదోక్షజాయ నమః ;
ఓం ఋషభాయ నమః ;
ఓం మోహినీ రూపాయ నమః ;
ఓం ధరాయ నమః ;
ఓం సంకర్షనాయ నమః ;
ఓం ప్రుధవే నమః ;
ఓం క్షీరాబ్ది శాయినే నమః ;
ఓం భూతాత్మనే నమః ;
ఓం అనిరుద్దాయ నమః ;
ఓం భక్త వత్సలాయ నమః ;
ఓం నారాయణాయ నమః ;
ఓం గజేంద్ర వరదాయ నమః ;
ఓం త్రిగ్దామ్నే నమః ;
ఓం సూర్య మండల మధ్యగాయ నమః ;
ఓం సనకాది మునీ ధ్యేయాయ నమః ;
ఓం భగవాశతే నమః ;
ఓం శంకర ప్రియాయ నమః ;
ఓం వీర గందాయ నమః ;
ఓం ధరా కాంతాయ నమః ;
ఓం వేదాత్మనే నమః ;
ఓం బాదరాయ ణాయ నమః ;
ఓం భాగీ రదీ జన్మ భూమినే నమః ;
ఓం పాద పద్మాయ నమః ;
ఓం సతాం ప్రభవే నమః ;
ఓం స్వభవే నమః ;
ఓం విభవే నమః ;
ఓం ఘన శ్యామాతవాసనే నమః ;
ఓం శ్వేత ద్వీప వానినేవ్యాయ నమః ;
ఓం గోవిందాయ నమః ;
ఓం బ్రహ్మ జనకాయ నమః ;
ఓం కైటభాసుర మర్ధనాయ నమః ;
ఓం శ్రీధరాయ నమః ;
ఓం కాయ ణమః ;
ఓం జగత్కార ణాయ నమః ;
ఓం అవ్యయాయ నమః ;
ఓం దశావతారాయ నమః ;
ఓం శాంతాత్మనే నమః ;
ఓం లీలా మానుష విగ్రహాయ నమః ;
ఓం దామొధరాయ నమః ;
ఓం విరాట్ రూపాయా నమః ;
ఓం భూత భవ్య భవిత్రు భవనే నమః

పిదప అగరువత్తిని వెలిగించి .......

ధూపం 

శ్లో || దశాంగం గగ్గులో పేతం చంద నాగరు వాసితం
ధూపం గృహాణ దేవేశ ధూర్జటి స్తుత సద్గుణ

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి .ధూపం
సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ
పొగను స్వామికి చూపవలెను.

దీపం 

శ్లో || అజ్ఞాన ద్వాంత నాశాయ అఖండా లోక శాలినే
ఘ్రుతాకావర్తి సంయుక్త దీపం దాస్యామి శక్తితః

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః సాక్షాత్ దీపం
దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో ఉన్న అదనపు వత్తులలో ఒక
దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ
దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను .ధూప దీపానంతరం శుద్దాచమనీయం
సమర్పయామి.

నైవేద్యం

శ్లో || పృదు కానిక్షు ఖండాంశ్చ కదళీ ఫల సంయుతం
దాపయిష్యే భవత్ప్రీ త్యై గృహాణ సురవందిత

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నైవెధ్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి స్వామివద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ' ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ,దీయో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, (ఋ తంత్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను ) అమృతమస్తు అమృతో పస్తరణమసి , ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరి ణెతో ) స్వామికి  నివేదనం చూపించాలి. పిదప ఓం తులసీదాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నైవేద్యా నంతరం 'హస్తౌ ప్రక్షాళయామి ' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి .తరువాత 'పాదౌ ప్రక్షాళ యామి ' అని మరొకసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి .పునః శుద్దాచ మనీయం సమర్పయామి .అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి .

తదనంతరం .....

తాంబూలం :

శ్లో || ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
విస్తీర్ణ కర్పూరేణ సుశం మిశ్రమ తాంబూలం స్వీకురు ప్రభో

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు ,రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి )స్వామీ వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ
ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .పిమ్మట కర్పూరం వెలిగించి .......

నీరాజనం 

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి ,మూడుమార్లు తిప్పుచూ, చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి ' అని చెప్పి
నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు
అద్దుకోవాలి.

తరువాత అక్షతలు ,పువ్వులు ,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని

మంత్రపుష్పం :

శ్లో || పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యా దత్తా మిదం ప్రభో
అనుగ్రహ హేణ మాం రక్ష దేవ దేవ దయానిధే

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః యధా శక్తి
మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు ,చిల్లర స్వామి
వద్ద ఉంచవలెను . పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు
చేయాలి .

ప్రదక్షిణం :

శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సర్వ భ్రమ నివారణం
సంసార సాగరాన్సాంత్వం ముద్దర స్వ మహాప్రభో
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ
నమస్కారాన్ సమర్పయామి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి
మూడుసార్లు ఆత్మ ప్రదక్షణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట
శ్రీ స్వామికి ,అమ్మవారికి (లక్ష్మీ నారాయణులకు) సాష్టాంగ నమస్కారం చేసి
(మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి ,ఆడువారు మోకాళ్ళపై పడుకుని
కుడికాలు ఎడమకాలుపై వేసి )తరువాత స్వామిపై చేతిలో ఉన్న అక్షతలు పువ్వులు
చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ ........

పునః పూజ :


ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకొని ,పంచపాత్రలోని నీటిని చేతితో తాకి ,అక్షతలు స్వామిపై  చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .

విశేషోపచారములు

ఛత్రం ఆచ్ఛాదయామి, చామరం వీచయామి ,నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోప చార పూజాం సమర్పయామి అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

పూజా ఫల సమర్పణమ్ 

శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీలక్ష్మీ నారాయణ సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు . ఏతత్ఫలం శ్రీ లక్ష్మీనారాయణార్పణ మస్తు.

అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను .

పిమ్మట 'శ్రీ లక్ష్మీ నారాయణ ప్రసాదం శిరసా గృహ్ణామి ' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను . ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు
గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

తీర్ధ ప్రాశనమ్ 

శ్లో || అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీ ........పాదోదకం పావనం శుభమ్ ||

అని

తీర్ధమును చేతిలో వేసుకొని మూడు మార్లు నోటిలోనికి తీసుకొనవలెను . క్షీరాబ్ధి ద్వాదశి అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఉసిరి చెట్టు క్రింద తులసి మొక్కను పెట్టి పూజలు జరుపుతారు .ఈ విధంగా చేయుటవలన శ్రీ లక్ష్మీ నారాయణుల వివాహము చేసినట్లవుతుందని చెబుతారు. ఈ రోజున తులసి ముందు దీపముంచిన వారికి విష్ణు కృప కలుగుతుంది . అంతే కాక బృందావనంలో శ్రీ కృష్ణుని సన్నిదానంలో ఒక్క దీపమైన నూ వెలిగించినచో అనంత పుణ్యము ప్రాప్తించును . సరాసరి వైకుంటమునకేగుదురు. ఈ దీపమును దానము చేయవలెను. ప్రతిమా దానము (పూజను చేసిన ప్రతిమను కూడా దానము చేయవచ్చును .

ఈ వ్రతమునే తులసీ దామోదర వ్రతమని కూడా అంటారు. ఈ వ్రతమునకు శ్రీ మన్నారాయణుడి విగ్రహాన్ని బంగారంతో చేయించి ,తులసికోట వద్ద ఉంచి ,కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి విష్ణు, తులసి సహస్రనామాలతో అర్చించి ,పిదప తులసీ దామోదరు (నారాయణు) లకు కళ్యాణం జరిపిస్తారు. అనంతరం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు , పుణ్య స్త్రీలకు వాయన దానాలు సమర్పించి ,వారి ఆశీర్వాదం పొందుతారు. ముఖ్యంగా ఈ పూజ చేసిన ప్రదేశంలో ఉసిరి కాయలపై నెయ్యి వత్తులు వేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే ఎంతో పుణ్యప్రదం.

క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ


క్షీరాబ్ధి ద్వాదశి కధను బ్రహ్మ దేవుడు ఈ విధంగా చెప్పుచున్నాడు .ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో శయనించి యుండు విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీ ,బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమున కేగును.(వెళ్ళును) కావున ఆ రోజున బృందావన మందు ఎవరు శ్రద్దా భక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘమైన ఆయుష్షు , ఆరోగ్యము, ఐశ్వర్యములు కలిగి సంతోషముగా ఉందురు .ఈ వ్రతము చేయువారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడస్తమించిన తరువాత స్నానము గాని ,దానము గాని ,పూజ గాని చేసినచో అధిక ఫలమును పొందుదురు. క్షీర సముద్రము నుండి లక్ష్మీ దేవితో గూడి సమస్తమైన మునులచేత కీర్తించ బడుచున్న పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చట వాసము చేయునో అట్టి బృందావనమందు పూజనీయుడై ,నిత్యుడై, తులసీ సహితుడైనట్టి శ్రీమన్నారాయణ మూర్తిని ,బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్దా భక్తి యుక్తులై పూజించియున్నారు . కావున మానవ మాత్రులెవరు ఈ వ్రతమును చేసినను సమస్త పాపములు నశించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు.

శ్రీ మహా విష్ణువు వశిష్టాది మహామునులచేత నానా విధ స్తోత్ర పూర్వకంగా తులసీ వనమందు పూజింప బడుతుంటాడు. ఆ కాలమందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసీవనమందు ఎవరు తులసీ సహిత విష్ణువును పూజించు చుందురో వారు సర్వ పాపములను పోగొట్టు కొన్నవారై విష్ణు సాన్నిధ్యము పొందుదురు. మునీశ్వరులైనను, యక్షులు, నారదుడు మొదలగువారు కూడ సమస్త పాపములు నశించుటకు గాను బృందావనములో సన్నిహితుడైన శ్రీ మహా విష్ణువును పూజ చేయుచున్నారు . పతితుడైనను ,శూద్రుడైనను, మహాపాతకము చేసిన వాడైనను కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి ) రోజున తులసీ సహిత విష్ణువును పూజించిన వారి పాపములు అగ్నిహోత్రంలో వేసిన ప్రత్తి పోగువలె నశించును . ఇక బ్రాహ్మణుడైనచో ఫలము ఇట్టిదని చెప్పవలసిన పనిలేదు .తులసీ సహితుడైన విష్ణువును పూజ చేయని వారు పూర్వ పుణ్యములు కూడా పోయి నరకమును పొందుదురు . బృందావనమున సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్వర్గమును పొందుదురు.

బృందావనము చాలా మహత్యము కలిగినదని ,అచ్చట పూజించి నట్లయితే విష్ణువునకు అత్యంత సంతోష కరమని పూర్వము దేవతలు ,గంధర్వులు ,ఋషులు మొదలగు వారందరును బృందావనమందు సన్నిహితుడైన శ్రీ మహా విష్ణువును పూజ చేసిరి . కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసీ సహితుడైన నారాయణ మూర్తిని పూజించని మనుజుడు కోటి జన్మలు పాపిగా చండాలునిగా పుట్టును. ఆ రోజున బృందావనమందు శ్రీ మహా విష్ణువును శ్రద్దా భక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మ హత్యా మహా పాతకములు కూడ పూర్తిగా పోయి అనేక పుణ్య ఫలములు పొందుదురు. అట్టి మహా పుణ్య కరంబగు నట్టిది గాన తులసీ బృందావన సన్నిధానము నందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమగును . ఈ వ్రతమును చేయువారు (పురుషులు ) స్నాన సంధ్యా వందనములను పూర్తి గావించుకొని , యధావిధిగా నానావిధ వేద మంత్రములచేత గాని ,పురుష సూక్తము చేత గాని శ్రద్దా భక్తులతో పూజ చేయవలెను .ఎలాగంటే ప్రధమమున పంచామృత స్నానం గావించి , ఆ పిమ్మట శుద్దోకములచే అభిషేక మొనర్చి శ్రీ విష్ణువును వస్త్రములచే అలంకరించి నానావిధములగు పుష్పములచేతను , ధూప దీపముల చేతను పూజించి ,భక్తితో నైవేద్యము నిచ్చి ,దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ తరువాత కర్పూర నీరాజనములు సమర్పించవలెను .

లోకమునందు ఎవరు ఈ ప్రకారము పూజ గావించుదురో వారు సకల పాపములు తొలిగి సమస్త సుఖములు పొందుదురు .ఇంటిలో ఈశాన్య మూలములో గోమయముచే (ఆవుపేడ ) అలికి, రంగుల ముగ్గులతో అలంకరించి ,పద్మము ,శంఖము, చక్రము, పాదములు ఆ తిన్నె మీద అలంకరించి పూజించి గీత వాద్యములతో వేద ఘోషములతో తులసి కధను వినవలెను. పుణ్యము కోరువారు ఎట్లైన తులసీ వ్రత మహత్యమును వినవలెను. విష్ణు దేవునికి మిక్కిలి ప్రీతి చేయవలెనన్న ద్వాదశి రోజున ,బ్రాహ్మణ సభలో తులసీ వ్రత మహత్యమును విన్నచో దుఃఖములన్నియు నశించి విష్ణు లోకమును పొందుదురు. ఈ పూజా సమయమునందు ధూప దీపములు చూచినా వారు గంగా స్నాన ఫలమును పొందుదురు . నీరాజనము (హారతి ) చూచినచో పాపమంతయు నిప్పులో పడిన ప్రత్తివలె నశించును.

నీరాజనమును నేత్రములందు ,శిరస్సు నందు అద్దుకొనుదురో వారికి విష్ణు లోకము కలుగును. తరువాత బెల్లము, టెంకాయలు , ఖర్జూరము , అరటిపళ్ళు ,చెరకు ముక్కలు మొదలగునవి . స్వామికి నివేదనము చేయవలెను. తులసీ సహితుడైన శ్రీ మహా విష్ణువునకు నైవేద్యము సమర్పించి ,బ్రాహ్మణుల శ్రద్దా భక్తులతో పూజించి ,దక్షిణలను ఇవ్వవలెను .ఈ వ్రతమును ఆచరించిన వారి కోటిజన్మల పాపములు నశించి ,లోకమున సమస్త భోగములు అనుభవింతురు. ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు అవశ్యము దీపదానం చేయవలెను.

ఒక దీపము దానము చేసినట్లయిన ఉపపాతకములు నశించును. పది దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగును. ఇంతకు మీదట దీపదానం చేయుటవలన స్వర్గాదిపత్యమును పొందుదురు . బ్రహ్మాదులకు దీపదానం ప్రభావం వల్లనే వైకుంటము నందు శాశ్వతమైన నివాసము కలిగెను . కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానమును ఎవరు చేయుదురో వారు వైకుంటములో సమస్తమైన భోగముల ననుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు .ఆ దీప దర్శన మాత్రముననే ఆయుష్షు , బుద్ది, బలము, ధైర్యము, సంపత్తులు ,పూర్వ జన్మ స్మరణం మొదలగునవి అన్నియు కలుగును.

దీపమునకు ఆవునెయ్యి ఉత్తమం అనగా మంచిది .మంచినూనె మధ్యమము (అనగా మంచినూనె అయిననూ పరవాలేదు)  ఇతర వన్య తైలములు (అడవిలో లభించు నూనెలు ), ఇప్పనూనె అధమము (పై రెండు నూనెలు దొరకని సమయమున ఈ నూనెలు వాడవచ్చును ) ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు, మోక్ష ప్రాప్తియు ను లభించును. మంచినూనెతో దీపము వెలిగించిన కీర్తి సంపదలు లభించును . ఇప్పనూనె ఇతర వన్య తైలములు కార్య సిద్ది కలుగును. ఆవనూనె గాని ,అవిశ నూనెతో గాని దీపము పెట్టిన శత్రువులు నశింతురు . ఆముదముచే దీపముంచిన సంపద ,కీర్తి , ఆయుష్షు క్షీణ మగును. గేదె నెయ్యితో దీపము వెలిగించిన పూర్వము చేసిన పుణ్యము కూడా నశించి పోవును. దానికి స్వల్పముగా ఆవునెయ్యి కలిపి దీపము పెట్టినట్లయిన దోషము లేదు.

ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపములు పోయి ,తేజస్వి గాను ,బుద్ది మంతుడుగాను అగును. నాలుగు వత్తులతో దీపములు పెట్టి దానము చేసిన రాజు అగును. పది వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన చక్రవర్తి అగును. ఏబది వత్తులతో దీపము వెలిగించి దానము చేసిన దేవతలలో ఒకడును ,వంద వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన విష్ణు సాన్నిధ్యమును పొందును. వేయి వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన ఇంద్రుడితో సమాన మైన వాడగును. ఈ దీప దానము విష్ణు క్షేత్రమందు తులసీ సన్నిధి యందు చేసినట్లయిన విష్ణు లోక ప్రాప్తి కలుగును. ఈ వ్రత విధానము మరియు కధ ఈ క్రింది విధముగా కూడా చెబుతారు.

ఈ క్షీరాబ్ది ద్వాదశిన అంబరీషుడు అను విష్ణు భక్తుడు ' ద్వాదశి వ్రతము'ను ఆచరించెను. కార్తీక శుద్ధ దశమి రోజున ,పగలు మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున యే వ్రతమూ చేయక పూర్తి ఉపవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజించావలయును. అంబరీషుడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు . ప్రతి ద్వాదశి నాడు తప్పక వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆరోజు పెందలకడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచెను. ఆ సమయమునకు అచ్చటకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను.

అంబరీషుడు ఆ మునిని గౌరవించి ,ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయును గాన త్వరగా చేసి రమ్మని కోరెను. దూర్వాసుడు అందుకు అంగీకరించి వెడలెను.అంబరీషుడు ఎంత సేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటి పోవుచున్నవి .ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు పిలిచి తరువాత పెట్టక పోయినచో మాట తప్పినట్లయి మహాపాప మగును. అది గృహస్తునకు ధర్మము కాదు .ఆయన వచ్చు వరకూ ఆగినచో ద్వాదశి ఘడియలు దాటిపోవును.వ్రత భంగ మవును. ఆయన రాకుండా నేను భుజించినచో నన్ను శపించును. నాకేమి తోచుట లేదు అని మనస్సులో తలచు చుండెను. భ్రాహ్మణ భోజనము అతిక్ర మించరాదు .

ద్వాదశి ఘడియలు మించి పోకూడదు . ఘడియలు దాటిపోయిన పిదప హరి భక్తి వదలిన వాడనగుదును అని అంబరీషుడు ఆలోచించి ,బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహా విష్ణువే పోగొట్ట గలడు. అని ద్వాదశి ఘడియలు ఉండగానే భోజనము చేయ నిశ్చయించి ,పండిత శ్రేష్టులతో యోచించి జలపానము చేయుట దోషము గాదని యెంచి , స్వీకరించ బోవునంతలో దూర్వాసుడు వేగముగా కోపముతో అంబరీషుని యొద్దకు వచ్చి ఓరీ ! మధాందా నన్ను నన్ను భోజనమునకు రమ్మని పిలిచి నేను రాక మునుపే నీవేల భుజించితివి ? ఎంత నిర్లక్ష్యము ? ఎంతటి ధర్మ పరిత్యాగివి. నీవు భోజనము స్వీకరించి హరి భక్తిని అవమానించినావు. బ్రాహ్మణా వమానమును శ్రీ హరి సహింపడు నీవు మహా భక్తుడునని అతి గర్వము కలవాడ వైనావు. అని నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు గడ గడ వణుకుచూ మహానుభావా ! నేను ధర్మ హీనుడను , నా అజ్ఞానం చే ఇట్టి అకార్యమును చేసితిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు దయగల వారుగాన నన్ను కాపాడుమని వేడుకొనెను . అంత దూర్వాసుడు దోషికి శాప మివ్వకుండా ఉండరాదని ఘోర శాపము నివ్వబోగా శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ శాపము వృధా కారాదు ,అటులనే తన భక్తునికి ఏ అపాయము కలుగ కూడదని ఎంచి తన సుదర్శన చక్రము అడ్డు పెట్టెను.

ఆ సుదర్శనము దూర్వాసుని వెంబడింపగా అతను భీతి చెంది సర్వ మునులను, దేవతలను, బ్రహ్మను, శివుని ఎంత ప్రార్ధించిననూ ఎవ్వరునూ ఆ ఆయుధ భారి నుండి దూర్వాసుని కాపాడ లేక పోయిరి. ఏ లోకములోనివారు తనను రక్షించక పోవుటచే వైకుంట మందున్న మహావిష్ణువు కడకు వెళ్లి జగన్నాధా ! వాసుదేవా ! నేను అపరాధము చేసితిని నీవు నన్ను క్షమింపుము .నీ చక్రాయుధము నన్ను జంపగా వచ్చుచున్నది . దానిని నివారించి నన్ను అనుగ్రహింపుము . నీవు భృగు మహర్షి చేసిన అపరాధమును సహించితివి. నా యందు కూడా నీ దయ కురిపించుము. అని వేడుకొనగా శ్రీ హరి చిరునవ్వు నవ్వి ,దూర్వాసా నేను బ్రాహ్మణ ప్రియుడను నీవు బ్రాహ్మణావతారమెత్తిన రుద్రుడవు.

నేను త్రికరణ ములచే బ్రాహ్మణులకు ఎట్టి హాని కలిగించను ప్రతియుగమున గో, దేవ, బ్రాహ్మణ ,సాధు జనంబులకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు అవతారములెత్తి దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ గావింతును నీవు అకారణ ముగా అంబరీషుని శపించితివి నీవిచ్చిన పది శాపములను అనుభవించెద నని అంబరీషుని ద్వారా బదులు పల్కిన వాడను నేనే బ్రాహ్మణులను దూషించరాదు. నీవు పోయి అంబరీషుని వద్దకే వెళ్లి వేడుకొమ్మని పంపెను. వెంటనే శ్రీ మన్నారాయణుని వద్ద సెలవు తీసుకుని , అంబరీషుని వద్దకు వచ్చి ధర్మ పాలకా అంబరీషా నన్ను రక్షింపుము నా తప్పును క్షమింపుము . శ్రీ మన్నా రాయణుని వేడుకొనగా నీ దగ్గరకు పంపినాడు . అనిన అంబరీషుడు సుదర్శన చక్రమును ధ్యానింపగా అది శాంతించెను . ఈ రీతిగా దూర్వాసుడు శాంతించి అంబరీషునితో నీ వలన సుదర్శన చక్రమును ,శ్రీ మహావిష్ణువును దర్శించు భాగ్యము నాకు కలిగినది .నీతో భోజనము చేయుట నా భాగ్యము అని దుర్వాస మహా ముని పలికి , అంబరీషుని కోరిక మేరకు పంచ భక్ష్య పరమాన్న ములతో విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తిరిగి తన ఆశ్రమమునకు వెళ్ళెను.