తిరుమల శ్రీ వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి.
ముందుగా రాత్రి 7.00 నుండి 9.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. రాత్రి 9.00 నుండి 10.00 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు.
ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.