తిరుమలకు సంబంధించిన అపురూపమైన పాత ఫోటోలు టిటిడికి పంపవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన ఫోటోలు శ్రీవారి భక్తుల చెంత ఉన్న యడల సెప్టెంబరు 16వ తేదీ శనివారంలోపు పంపవలసిందిగా భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేస్తొంది.

శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద ”నాడు – నేడు” పేరిట ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం విధితమే. శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవంలో భక్తులను భాగస్వాములను చేసేందుకు టిటిడి గత రెండు సంవత్సరాలుగా టిటిడి ఫోటోలతో పాటు భక్తుల నుండి వచ్చిన అపురూపమైన ఫోటోలను ప్రదర్శనలో ఉంచుతున్నది.

కావున తిరుమల, తిరుపతిలోని టిటిడి స్థానిక ఆలయాలు, ఇతర టిటిడి అనుబంధ ఆలయాలకు సంబంధించిన అపురూపమైన పాత ఫోటోలు కలిగిన భక్తులు క్రింది చిరునామాకు పంపవలేను. ఫోటోలు పంపవలసిన చిరునామా – ప్రజాసంబంధాల అధికారి (పి.ఆర్‌.ఒ), టిటిడి పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి -517520. ఇతర వివరాలకు ఫోన్‌ నెం. 0877 – 2264217ను సంప్రదించగలరు.

కాగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో కూడా టిటిడి ఛాయచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యపూజా విధానంలో వివిధ సందర్భాలలో వినియోగించే పాత్రలు, పూజా ద్రవ్యాల ఛాయాచిత్రాలు ప్రదర్శనలో వుంటాయి. శ్రీవారు ప్రత్యేక పర్వదినాలు, ఇతర ఉత్సవాల దినాల్లో పూజలు అందుకునే ఉత్సవమూర్తుల ఫొటోలు భక్తిబావాన్ని పెంచేలా ఆయా అంశాలకు సంభందించి ప్రత్యేకంగా విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో తరతరాల తిరుమల పేరిట 80 సంవత్సరాల క్రితం శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టే అరుదైన ఫొటోలు భక్తులను ఆకర్షనున్నాయి. 1950 సంవత్సరానికి ముందు అటు తరువాత శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవ వ్యవస్థ ఫొటోలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి.